Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Outrage house అత్తగారి ఇంటిపై ఆక్రోశం..!

--భార్యతో వ్యక్తిగత విభేదాలే కారణo -- 'కుటుంబం' పై పగ పెంచుకున్న వైనం -- అందరిని అంతం చేయాలని విష ప్రయోగం -- హైదరాబాద్ మియాపూర్ లో ఘటన

అత్తగారి ఇంటిపై ఆక్రోశం..!

  • భార్యతో వ్యక్తిగత విభేదాలే కారణo
    — ‘కుటుంబం’ పై పగ పెంచుకున్న వైనం
    — అందరిని అంతం చేయాలని విష ప్రయోగం
    — హైదరాబాద్ మియాపూర్ లో ఘటన

ప్రజా దీవెన/ హైదరాబాద్: కాపురంలో నెలకొన్న కలహాలు కల్లోలం సృష్టించాయి. భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆమె కుటుంబ సభ్యులపై పగను పెంచుకున్న భర్త ఏకంగా అత్తగారి కుటుంబాన్ని మొత్తం అంతం చేయాలని విష ప్రయోగం చేశాడు. ప్రయత్నంలో ముందు అత్తను చంపి ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల అవయవాలు పనిచేయకుండా చేశాడు.

ఇందులో గమనించాల్సింది ఏమిటంటే ఈ కుట్ర తతంగం యావత్తు లండన్ లో ఉండి నడిపించగా ఈ ఘటన హైదరాబాద్ మియాపూర్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్ మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ లో హనుమంతరావు, ఉమామహేశ్వరి అనే దంపతులు నివాసం ఉంటున్నారు.

జులై 5న ఉమామహేశ్వరి అకస్మాత్తుగా మరణించింది. అందరూ కూడా ఆమె అనారోగ్యం కారణంగా మృతి చెందిందని భావించారు. అయితే హనుమంతరావు తో పాటు ఆయన ముగ్గురు పిల్లల కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయాయి.

కుటుంబ సభ్యులందరికీ ఈ రుగ్మత ఒక్కసారిగా బయటపడటంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. అందరూ వైద్య పరీక్షలు చేయించుకుంటే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరీరంలో విష ప్రయోగం జరగడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు.

వెంటనే హనుమంతరావు కుమార్తె డాక్టర్ శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే అల్లుడు అజిత్ కుమార్ ఈ తతంగానికి సూత్రధారి అని తేలింది. వివరాల్లోకెళితే.. హనుమంతరావు కుమార్తె డాక్టర్ శిరీష కు, అజిత్ కుమార్ అనే సాఫ్ట్వేర్ కు 2018 లో వివాహం అయింది.

ఈ దంపతులు ఉద్యోగరీత్యా లండన్ లో స్థిరపడ్డారు.ఈ దంపతులకు ఒక కుమార్తె సంతానం. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో డాక్టర్ శిరీష లండన్ లోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుండి ఈ దంపతులు వేరుగా ఉంటున్నారు.అజిత్ తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కోపం పెంచుకుని వారందరినీ చంపేయాలని అనుకున్నాడు.

తన వద్ద పనిచేసే వినోద్ కుమార్, హైదరాబాదులో ఉన్న స్నేహితులు భవాని శంకర్, అశోక్, గోపీనాథ్, పూర్ణచంద్రరావు లతో కలిసి కుట్ర పన్నాడు.అదే సమయంలో సోదరుడి వివాహం కోసం లండన్ నుండి శిరీష హైదరాబాద్ వచ్చింది. ఆమె కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు గోకుల్ ప్లాట్స్ వాచ్ మెన్ కుమారుడైన రమేష్ కు కొంత నగదును ఇచ్చాడు.

పసుపు, కారం లాంటి శాంపిల్ ప్యాకెట్లలో గుర్తు తెలియని విషం కలిపి డెలవరీ బాయ్ సాయంతో ఇంటికి పంపించాడు. వాటిని వినియోగించిన హనుమంతరావు కుటుంబంలో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. జులై 5న ఉమామహేశ్వరి మృతి చెందిన తర్వాత శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా పెట్టారు.

సీసీటీవీ రికార్డులను పరిశీలించగా వాచ్ మెన్ కుమారుడు రమేష్ వ్యవహార శైలిపై అనుమానంతో విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.