— తెలంగాణ పామ్ ఆయిల్ రైతులకు భారీ ఊరట
– -మంత్రి తుమ్మల విన్నపం మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం
– -దిగుమతి సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు
Palm oil Farmers: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయశాఖ మాత్యులు శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) కు రాష్ట్ర రైతుల తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwara Rao) కృతజ్ఙతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహన్ రాష్ట్ర పామ్ ఆయిల్ రైతుల తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఙతలు తెలియజేశారు. గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశ పడడమే కాకుండా, కొత్తగా ఆయిల్ పామ్ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రి పేర్కొన్నారు.
ఇది దృష్టిలో ఉంచుకుని, రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభ సాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్స హించాలనే ఉద్ధేశ్యంతో, ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయి ల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్య లను తీసుకోవాలని ఇటీవల లేఖ ద్వారా మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమైనది. ఇటీవల మన రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ విషయంపై మంత్రి వర్యులు తుమ్మలతో పాటు ఆయిల్ పామ్ రైతులు (Palm oil Farmers) కూడా ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మంత్రి చొరవతో సెప్టెంబర్ 13 న కేంద్ర ప్రభుత్వం ముడిపామ్ ఆయిల్ (Raw palm Oil) దిగుమతిపై సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనివలన ప్రస్తుతం టన్నుకు రూ. 14,392/- గా ఉన్న ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు కనీసంగా రూ. 1500/- నుండి రూ. 1700/- వరకు పెరిగి టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ. 16,500/- దాటే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ (Telangana) రాష్ట్రంలో 44,400 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది. ఈ దిగుమతి సుంకం పెంచడం వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు అదనంగా లబ్ధి చేకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు. పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల విదేశిమారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం పొందుతారని, అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వలన నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడనుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని, ప్రస్తుతము, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమము అయినటువంటి నేషనల్ మిషన్ ఆన్ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్పామ్ (NMEO-OP) ద్వారా అమలు చేయబడుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.00 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుతుందని, అలాగే రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టుటకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఇందుకోసం ఆయిల్ పామ్ కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా (44) నర్సరీలు ఏర్పాటుచేశాయన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర రైతులు సద్వినియోగం చేసుకుని, రైతులు భారీగా పామ్ ఆయిల్ సాగు చేయాలని మంత్రి కోరారు.