–పార్టీ కేడర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అగ్ర తాంబూలం
–సామాజిక సమతూకంతో తొలి విడత నామినేటెడ్ పదవులు
TDP: ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో టిడిపి (tdp)అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. తొలివిడతగా ప్రకటించిన 99 మందితో నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ (BC, SC, Minority, ST)లకు పెద్ద పీట వేసింది. తొలివిడతలో 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు లభించగా, అందులో ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి వరించింది. వీరితోపాటు 6 గురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు లభించాయి. మొత్తం పదవుల్లో 20 కార్పొరేషన్లు కు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన 99 పదవుల్లో యువత కు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. సామాజిక సమతూకం పాటిస్తూ సోషల్ ఇంజనీరింగ్ తో తొలి విడత ప్రకటించిన పదవులపై పార్టీ క్యాడర్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ‘
రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raja)కోసం సీటు త్యాగం చేసిన అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి లభించింది. మాజీ ఎంపీ, విసి నేత కొనకళ్ళ నారాయణరావుకు కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) చైర్మన్ పదవి లభించింది. అలాగే యువగళం పాదయాత్రలో వాలంటీర్స్ కోఆర్డినేటర్ గా పనిచేసిన అనిమిని రవి నాయుడుకు శాప్ చైర్మన్ పదవి, మంగళగిరిలో పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అబద్దయ్యకు పద్మశాలి కార్పొరేషన్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీమంత్రి పీతల సుజాతకు వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్, మాదిగ సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాలరావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి. పొత్తు కారణంగా సీటు కోల్పోయిన అనకాపల్లికి చెందిన పేలా గోవింద్ సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు. ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేసిన దామచర్ల సత్యకు కీలకమైన మారిటైం బోర్డు చైర్మన్ పదవి లభించింది. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యసాధనలో కీలకం కానున్న సీడాప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గునుపాటి దీపక్ రెడ్డికి (Gunupati Deepak Reddy) ఇచ్చారు. పొత్తు కారణంగా సీటు కోల్పోయిన నెల్లిమర్లకు చెందిన బీసీ నేత కర్రోతు బంగార్రాజుకు మార్క్ ఫెడ్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు. ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, బీసీ నేత నూకసాని బాలాజీకి కీలకమైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది.