Revanth Reddy Sarkar: మీ దగ్గర పదిహేనేళ్లు పైబడిన పాత వాహనం ఉందా..? అయితే మీకో తీపి కబురు. ఇటువంటి వాహనాలు తరుచూ రిపేర్లకు గురవుతూ ఉంటాయి. ఫ్యూయల్ కూడా ఎక్కువగానే ఖర్చవుతుంటుంది. వాటి ఫిట్నెస్ సరిగా లేక రోడ్డు ప్రమాదాలు (Road accidents)కూడా జరగుతుంటాయి. ఇవే కాకుండా గ్రీన్ ట్యాక్స్ పేరుతో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సెకండ్ వెహికల్ కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ (Registration)సమయంలో లైఫ్ ట్యాక్స్ కింద అదనంగా మరో 2 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. మీ దగ్గర ఉండే పాత వెహికల్స్ ‘తుక్కు విధానం’పై రేవంత్ ప్రభుత్వం (Revant Govt) కొత్త పాలసీని తీసుకువస్తోంది. ఈ మేరకు ఆయా ప్రతిపాదనలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరాయి. నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. 15 ఏళ్లు దాటిన వాహనాల్ని తుక్కు కింద మార్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘వాలంటరీ వెహికిల్ ఫ్లీట్ మోడ్రనైజేషన్ ప్రోగ్రాం/వెహికిల్ స్క్రాప్ పాలసీ’ని ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ప్రతిపాదించింది.
వాహనాదారులు తమ వద్ద ఉన్న పాత వెహికల్స్ను (Old vehicles) తుక్కుగా మారిస్తే.. లైఫ్ ట్యాక్స్లో కనీసం రూ.వెయ్యి నుంచి రూ.7 వేల వరకు, కార్లు వంటి వాహనాలకు అయితే కనీసం రూ.15 వేలు నుంచి రూ.50 వేల వరకు రాయితీని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా కొనుగోలు చేసే వెహికల్ విలువ ఆధారంగా ఈ రాయితీ మొత్తం ఉంటుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. పొల్యూషన్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర సర్కార్ (Central Govt)వాహన తుక్కు విధానాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటకతో పాటుగా గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది.