–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripati: ప్రజా దీవెన, నల్లగొండ: దాన్యం కొనుగోలు, కష్టం మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) విషయంలో జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Tripati) కోరారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో 2024- 25 దాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కష్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ చార్జీల పై సమావేశం నిర్వహించారు.
ఈ వానాకాలం ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు కష్టం మిల్లింగ్ రైస్ (CMR)లో ఎలాంటి ఆరోపణలు లేని రైస్ మిల్లులకు 10 శాతం బ్యాంకు గ్యారంటీతో సీఎంఆర్ కేటాయించడం జరుగుతుందని, ఒకవేళ ఎవరైనా మిల్లరు (Rice Millers) బకాయిలు ఉండి తదుపరి వాటిని చెల్లించినట్లయితే 20% బ్యాంకు గ్యారంటీతో సీఎంఆర్ ను కేటాయించడం జరుగుతుందని, గతంలో సీఎంఆర్ ఇచ్చి 25 శాతం జరిమానాతో చెల్లించి ఉన్నట్లయితే అలాంటి రైస్ మిల్లులకు 25% బ్యాంకు గ్యారంటీతో సీఎంఆర్ ను కేటాయించడం జరుగుతుందని, డిఫాల్టర్లకు ఎలాంటి ధాన్యం సిఎంఆర్ కేటాయించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎంఆర్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, పద్ధతి ప్రకారం మిల్లర్ల పనితీరు ఆధారంగా సీఎంఆర్ కేటాయిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అందువల్ల మిల్లర్లు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేటాయించిన ప్రకారం ఎప్పటికప్పుడు సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు.
మిల్లర్ల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు మిల్లింగ్ చార్జీలను చెల్లించనిందని, ప్రస్తుతము రా రైస్ (Raw Rice) కు క్వింటాల్ కు 10/- రూపాయలు, బాయిల్డ్ రైస్ కు 20/- రూపాయల మీల్లింగ్ చార్జీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం చెల్లిస్తుండగా.. వీటికీ అదనంగా రాష్ట్ర ప్రభుత్వం దొడ్డు ధాన్యానికి క్వింటాలకు 30/- రూపాయలు, సన్న ధాన్యానికి క్వింటాలుకు 40/- రూపాయలను చెల్లించనున్నట్లు వెల్లడించారు. బ్యాంకు గ్యారంటీలు సమర్పించిన మిల్లర్లకు తక్షణమే ధాన్యం కేటాయించడం జరుగుతుందని, ఈ విషయంలో మిల్లర్లు సహకరించాలని దీని వలన రైతులకు మేలు కలగడమే కాకుండా, మిల్లర్లకు సైతం మేలు కలుగుతుందని అన్నారు.
కాగా పలువురు మిల్లర్లు మాట్లాడుతూ.. గతంలో మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరగా.., ఈ విషయాన్ని తక్షణమే రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ 2023- 24 ఖరీఫ్ (Kharif), రబి సీజన్ (Rabi season) సిఎంఆర్ పై సమీక్షించారు. గత ఖరీఫ్ సీఎంఆర్ 99 శాతాన్ని, రబి సిఎంఆర్ 75 శాతాన్ని పూర్తి చేయడం పట్ల ఆమె జిల్లా రైస్ మిల్లర్లను అభినందించారు. నల్గొండ జిల్లా రైస్ మిల్లర్లు ఇదే ఓరవడిని భవిష్యత్తులో సైతం కొనసాగించి రైతులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, రైస్ మిల్లర్ల అధ్యక్ష, కార్యదర్శులు, రైస్ మిల్లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.