మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి
Buri Srinivas Reddy: ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , సిసి రోడ్లతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతానని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని 7వ వార్డు దాత్రి నగర్ లో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో అమృత్ స్కీం-2 ద్వారా రూ.216 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 36 కిలోమీటర్లు పనులు పూర్తయ్యాయని, అదేవిధంగా పలు వార్డులలో పనులు పూర్తి కావస్తున్నాయని చెప్పారు.
వచ్చే సంవత్సరం మే వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని అన్నారు.నల్గొండ పట్టణంలో ప్రతిరోజు ఇంటింటికి మంచినీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో నల్లగొండ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈనెల 7న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తున్న సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి మాజీ జడ్పిటిసి పాశం రాంరెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ భవాని గణేష్, కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, చిన్నాల అలివేలు జానయ్య, గుండగోని సాయి, బాబా, వజ్జ రమేష్ యాదవ్, మోష, పిల్లి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.