ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ 17వ రోజు సమ్మెలో భాగంగా స్థానిక జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు అరటి పండ్లు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఏళ్లుగా కష్టపడి చదివినా 20 ఏళ్లు సర్వేస్ ఇచ్చినా ఉద్యోగ భద్రత లేకపోవడంతో అభద్రతాభావంలో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సేవలను గుర్తించి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపించి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులపైన నాయకులపైన చేస్తున్న పోరాటం పైన తన సొంత న్యూస్ చానల్ లో శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొలుగురు కృష్ణ బొమ్మగోని రాజు తీవ్రంగా ఖండించారు. వెంటనే తీన్మార్ మల్లన్న గారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ తను చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని కోరారు. దీక్షకు మద్దతు గా ధర్మా టీచర్స్ యునియన్ ప్రధాన కార్యదర్శి నగేష్ మహారాజ్ హాజరు అయ్యారు.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు గుమ్మల మంజుల ముఖ్య సలహాదారులు ఎం నీలాంబరి, వసంత ,యాదయ్య, చందపాక నాగరాజు, వెంకటకృష్ణ , చేపూరి పుష్పలత, నాగభూషణ చారి, రాజేంద్రప్రసాద్ , బి సైదులు, మొయిజ్ ఖాన్, భిక్షం,చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.