Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripati: ప్రపంచంలో అన్నింటికీ మూలా ధారం సైన్స్

–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collector Tripati: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రపంచంలో అన్నింటికీ మూలా ధారం సైన్స్ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న డాన్ బోస్కో పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను ఆమె ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అంతేకాక సావిత్రిబాయి పూలే జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైన్స్ అన్నది ప్రతిచోట, ప్రతిరోజు ఉంటుందని తెలిపారు. జీవనశైలిని సైతం మార్చే శక్తి సైన్స్ కు ఉందని, రిలేటివిటీ థియరీ కి సైన్స్ పునాది వేసిందని అన్నారు. ప్రపంచంలో ప్రతి అంశానికి సైన్సు, గణితాలు పునాది వంటివి అని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు సైన్సు, గణితానికి సంబంధించి కనీసం ఒక్క పేజీ అయిన చదవడం అలవాటు చేసుకోవాలని, దీనివల్ల జీవనశైలిని మార్చుకోవచ్చని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఇదే జీవనశైలిగా మారుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సైన్స్ అభివృద్ధి కి మంచి వాతావరణం ఉందని ,విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ సైన్స్ ద్వారా శాంతి సమాజాన్ని సృష్టిద్దామని పిలుపునిచ్చారు. అందరూ సైన్స్ అభివృద్ధి కోసం కృషి చేయాలని, సైన్స్ టెంపర్ పెరగాల్సిన అవసరం ఉందని, సైన్స్ లో వస్తున్న చాలెంజీలను ఎదుర్కొనే విధంగా తయారు కావాలని తెలిపారు. సైన్స్ తోనే అన్ని అభివృద్ధి చెందుతున్నాయని, ముఖ్యంగా ఎంతో వెనుకబడిన నల్గొండ ప్రాంతం సైన్స్ వల్లనే అభివృద్ధి అయిందని, ఇప్పుడు నల్గొండలో ఏటుచూసిన అభివృద్ధి స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల మదిలో సైన్స్ బోధన చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా బోధించాలని తెలిపారు. సివి రామన్ చెప్పిన కొటేషన్ ను ఆయన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తెలియజేస్తూ “నా మతం సైన్స్. నేను సైన్స్ ని నమ్ముతానని” సి వి రామన్ తెలియజేశారన్నారు. జనవరి 3 ను ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతితో పాటు ,మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించునందున ఉపాధ్యాయులందరూ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో పని చేయాలని కోరారు.

మున్సిపల్ లో చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాలను బయటికి తీసేందుకు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని ,వినడం కన్నా ప్రాక్టికల్ గా చూడడం ద్వారా ఎక్కువగా నేర్చుకోవచ్చని, విద్యార్థులు చిన్నప్పటినుండి సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి. బిక్షపతి స్వాగతోపన్యాసం చేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డాన్ బోస్కో స్కూల్ ప్రిన్సిపల్ బాలశౌరి ,ఉప రవాణా కమిషనర్ వాణి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీలు రోడ్డు భద్రతపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం రెండు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి విధ్యా వైజ్ఞానిక ప్రదర్శనను ముఖ్య అతిథులు ప్రారంభించడమే కాకుండా విద్యార్థులు సైన్స్ ,గణితం, పర్యావరణం పై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. కార్య క్రమం ప్రారంభం లో బాల భవన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు అంద రినీ ఆకట్టుకున్నాయి.