Dr. Pawan Kumar : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ భౌతికశాస్త్ర అధ్యయనంతో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ కు చెందిన మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డా. పవన్ కుమార్ అన్నారు. మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్, జీవన ప్రగతి పై అవగాహన కార్యక్రమo జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ రిసోర్స్ పర్సన్ గా హాజరైన పవన్ కుమార్ మాట్లాడుతూ అన్ని పోటీ పరీక్షల్లో భౌతికశాస్త్రo కీలకమైందని అన్నారు.
భౌతికశాస్త్రంపై పట్టు ఉంటే సివిల్స్, గ్రూప్ వన్ లాంటి ఉన్నతమైన పరీక్షలను సునాయాసంగా దాటవచ్చని తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికలపై విద్యార్థులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. తాను తన అమ్మ జ్ఞాపకార్థం కన్నెమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పి వి జి ఆర్ ఫిజిక్స్ అకాడమీ పేరున పేద విద్యార్థులకు ఉచితంగా ఎమ్మెస్సీ ఫిజిక్స్ ఎంట్రన్స్ ను అందించడంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం విద్యార్థుల సేవలో ఉంటానన్నారు. ఆసక్తిగల విద్యార్థులు తమ ఫౌండషన్ లో చేరవచ్చని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసుకునే విద్యార్థులకు DRDO, CEPTAM,SSC,Civils, TGPSC మొదలగు రంగాలలో గల ఉద్యోగ అవకాశాలు మరియు NIMCET,IIR,JAM,JEST,CUCET,CPGET మొదలగు ప్రవేశ పరీక్షలపై విద్యార్థులకు విపులమైన వివరణ ఇస్తూ ఉత్సాహాన్ని నింపారు.
కోర్ సబ్జెక్టు అయినటువంటి ఫిజిక్స్ ను ఎంచుకోవడం ద్వారా డిగ్రీ లెవెల్ లో మరియు పీజీ లెవెల్ లో విద్యార్థులకు గల అవకాశాలను తెలియజేశారు. భవిష్యత్తులో పురోగతి ఉన్నటువంటి రంగాలను కెరీర్ గా ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు ఎం .వెంకట్ రెడ్డి, వి. వెంకటేశం ,సుమతి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.