–రాత్రి అయిన విద్యార్థుల సంఖ్యను వెల్లడించని అధికారులు
— ఇన్విజిలేటర్ సస్పెన్షన్
–40 మంది విద్యార్థుల గైర్హాజర్
Invigilator suspension : ప్రజాదీవెన , నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే జిల్లాలో శుక్రవారం కలకలం సృష్టించింది. రాత్రి 7 దాటిన విద్యాశాఖ జిల్లా అధికారులు పరీక్షకు ఎంత మంది విద్యార్థుల హాజరు అయ్యారు. ఎంతమంది గైర్హాజరు అయ్యారో ఆ సంఖ్యను వెల్లడించకపోవడం గమనార్హం. పరీక్షలకు సంబంధించి అసలు ఏం జరిగిందన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
విచారణ అంతా గొప్యం..
జిల్లా అధికారుల మొబైల్ ఫోన్లకు ఈ పత్రాలు చేరడంతో అప్రమత్తమైన డీఈవో భిక్షపతి, ఆర్డీవో అశోక్ రెడ్డి, నకిరేకల్ ఎంఈవో ఎం.నాగయ్య, జిల్లా పరీక్షల విభాగం అధికారులు నకిరేకల్ కు వచ్చి రహస్యంగా విచారణ చేపట్టారు. జిల్లాలోని నకిరేకల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలోని 8వ నెంబర్ గది నుంచి ఈ ప్రశ్న పత్రం చిత్రాలు బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఆ ప్రశ్నపత్రం పేజీల పై కోడ్ నెంబర్ ను హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కు పంపించి అది ఏ పరీక్ష కేంద్రానికి చెందినదో గుర్తించి సదరు అధికారులను నల్గొండలోని ఓ ప్రదేశంలో రహస్యంగా విచారించారు. ఈ సమయంలో అధికారులు ఎవరూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.
గోడ దుకిన గుర్తుతెలియని వ్యక్తులు…
పరీక్ష కేంద్రం ప్రహరీ గోడ దూకి కిటికీ వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పరీక్ష రాస్తున్న బాలబాలికల వద్ద ఉన్న ప్రశ్నపత్రాన్ని చరవాణీలో ఫొటో తీసినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. ప్రశ్నలకు నకలు జవాబు చీటీ కాపీలను సిద్ధం చేసి లోపలికి పంపించేందుకు ప్రయత్నం చేయగా కొందరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో లీకేజీ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది.కాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండలోని పలు కేంద్రాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. మొదటి రోజు పరీక్షకు 18,511 మందికి 18,471 మంది విద్యార్థులు హాజరయ్యారు.
15 నిమిషాలకే లీకేజీ…
పరీక్ష ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకైంది. లీకైన ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్ లో చక్కర్లు కొట్టడంతో యువకులు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను టెస్ట్ పేపర్ లో నుంచి చించి వాటిని ఒకే పేపర్ లో వచ్చేవిధం గా జిరాక్స్ తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపిం చేందుకు ప్రయత్నం చేశారు. టెన్త్ తెలుగు పేపర్ లీకైన విషయం శాలిగౌరారంలో వెలుగులోకి రావడంతో అధికారులు మండలకేం ద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశ్నాపత్రం
లీకైన సంఘటనపై గోప్యంగా విచారణ జరిపారు. మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి తహశీసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు చేరుకొని విచారణ జరిపారు.
ముగ్గురి తో ప్రత్యేక బృందం…
లీకేజీ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకున్నారు. దర్యాప్త కోసం ముగ్గురు సీఐలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నకిరేకల్ సీఐ రాజశేఖర్ తో సహా ముగ్గురిని శుక్రవారం రాత్రి నకిరేకల్ కు పంపించారు. ప్రశ్నాపత్రాన్ని బయటకు తెచ్చిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎంఈవో ఎం.నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి రాత్రి నకిరేకల్ స్టేషన్ కు చేరుకుని విచారణ చేపట్టారు. సమస్యాత్మకమైన నకిరేకల్ లో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలస్యంగా బయటకు..
పరీక్ష సమయం 12.30 గంటలకు ముగిసినప్పటికీ అధికారులు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నాపత్రం లీకైన సంఘటనపై విచారణ జరుపడంతో 1.15 గంటలకు విద్యార్థులను బయటికి పంపారు. లీకైన పేపర్ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లో క్షుణ్ణంగా విచారణ జరిపారు. వాట్సప్ లో లీకైన పేపర్ సీరియల్ నెంబర్ను , మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్ సీరియల్ నంబర్లను సరి చూశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన తర్వాతా ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యా ర్థులను బయటకు పంపిచారు.
ఇన్విజిలేటర్ పై వేటు…
లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్ పి. గోపాల్ తో పాటు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్(డీవో) రాంమోహనరెడ్డిలను విధుల్లోంచి తొలగించి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్ ను సస్పెండ్ చేసినట్లు డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కృష్ణారావు తెలిపారు.