Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM Paladugu Nagarjuna : ఎండిన పంట పొలాలకు ఎకరానికి 30 వేల రూపాయలు ఇవ్వాలి

–పాలడుగు నాగార్జున

–నల్గొండ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

CPM Paladugu Nagarjuna : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : ఇటీవల కాలంలో నీటి ఎద్దడికి నల్గొండ మండలంలో సుమారు 2003 ఎకరాలు వరి పంట ఎండిపోయిందని ఎకరాకు 30 వేల రూపాయలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గా సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా నల్లగొండ తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎమ్మార్వో తబితా కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా గ్రామాలలో రేషన్ కార్డులు అందలేదని, రేషన్ కార్డు లేకపోవడం వలన సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదని ఆరోపించారు. పెన్షన్లు రూపాయలు 2000 నుంచి 4 వేలకు పెంచుతామనే మాట బూటకమని అన్నారు. అదేవిధంగా రైతుబంధు రైతు రుణమాఫీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

అన్నారెడ్డి గూడెం, దోమలపల్లి గ్రామాలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి కూలిపోయే దశకు చేరాయని, పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే అర్హులైన పేదలకు ఇండ్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పాజీపేట, బుద్ధారం ఇతర గ్రామాలలో ప్రభుత్వం ఇండ్లకు కొనుగోలు చేసిన భూమిని పేదలకు పంచాలని, గ్రామాలలో తీవ్రమైన సమస్యలు నెలకొన్నాయని వాటి పరిష్కారానికి అధికారులు కనీసం స్పందన లేదని తెలిపారు. రోడ్లు, మురికి కాలువలు ఇతర ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నలగొండ మండల పరిధిలోని చందనపల్లి గ్రామానికి శాపంగా మారిన చెత్త డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించాలని కోరారు. ప్రజా సమస్యలపై ఈ నెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, కొండ వెంకన్న, జిల్లా అంజయ్య, బొల్లు రవీందర్ కుమార్, గోలి నరసింహ, కట్ట అంజయ్య, ముక్కామల యాదయ్య, రాములు, చారి తదితరులు పాల్గొన్నారు.