Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkata Reddy : ప్రభుత్వ వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడే ఆయుధాలు

–ఎంబిబిఎస్ డిగ్రీ పట్టా కాదు.. మనుషుల ప్రాణాలను నిలబెట్టే ఆయుధం

–రోగులకు గౌరవంగా చికిత్స అందించాలి

–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

— 5న క్రిటికల్ కేర్ యూనిట్ ను ప్రారంభిస్తామని వెల్లడి

–విద్యార్థులకు వైద్య పట్టాల అందజేత

Minister Komatireddy Venkata Reddy :ప్రజాదీవెన నల్గొండ :  ఎంబిబిఎస్ పూర్తిచేసుకుని వైద్య పట్టా పొందిన డాక్టర్లు ప్రభుత్వ సర్వీస్ లో చేరి ప్రజలకు సేవ చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థుల కాన్వకేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎంబిబిఎస్ డిగ్రీ కాదని, మనుషుల ప్రాణాలను నేరుగా నిలబెట్టగలిగే ఆయుధమన్నారు. అలాంటి వైద్య వృత్తిని పూర్తిచేసిన డాక్టర్లు ప్రభుత్వ సర్వీసులో చేరి పేద ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఎంతోమంది వైద్యులు పేద ప్రజలకు గొప్ప వైద్య సేవలను అందించి పేరు, ప్రఖ్యాతులు సాధించడమే కాక, పద్మభూషణ్, పద్మవిభూషన్ వంటివి పొందారని, అందులో తెలంగాణ నుండి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషన్ పొందారని అన్నారు.

రోగులకు గౌరవంగా చికిత్స చేయాలని, ప్రతి డాక్టర్ దేవుడితో సమానమని,డబ్బే ధ్యేయంగా కాకుండా, ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పనిచేయాలని పునరుద్ఘాటించారు.రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల వైద్య సంక్షేమం కోసం రాజీవ్ చేయూత, 108 అంబులెన్స్ వాహనాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేస్తున్నదని, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 40 వేల చదరపు అడుగులో క్రిటికల్ కేర్ యూనిట్ ను నిర్మించడం జరిగిందని, ఈనెల 5న దానిని ప్రారంభించనున్నామని, అలాగే కనగల్ పి హెచ్ సి లో గ్లూకోమా పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించామని, ప్రభుత్వ వైద్య కళాశాలను 28 ఎకరాలలో నిర్మించడం జరిగిందని తెలిపారు.

జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ వైద్యుల కృషి వల్ల గత నెల జిల్లా వ్యాప్తంగా మాతా మరణాలు లేవని, శిశిమరణాల 30 శాతం తగ్గాయని, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో లైఫ్ సేవింగ్ కార్యక్రమాలలో భాగంగా ఫోటో తెరఫీ, బేబీ వార్మింగ్ పరికరాల వంటివి ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ ఎం బి బి ఎస్ మనసుల జీవితాలను కాపాడే అద్భుతమైన కోర్స్ అని అన్నారు. డాక్టర్లు దేవుడితో సమానమని, వైద్య వృత్తి ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించవచ్చు అని అన్నారు. నూతనంగా వైద్య విద్య పట్టాలు పొందిన డాక్టర్లు ఎంతోమందికి వైద్య సేవలు అందించాలని, సంఖ్యాపరంగా చూడకుండా ఎంతమంది ప్రాణాలు కాపాడేమో, ఎంత మంచి నాణ్యమైన వైద్య సేవలు అందించామో చూడాలని ప్రివెంటివ్ మెడిసిన్ పై దృష్టి సారించాలని, అలాగే వైద్య విద్యలో భాగంగా విదేశాలలో పై చదువులు చదివినప్పటికీ తిరిగి భారతదేశానికి నల్గొండ ప్రాంతానికి వచ్చి పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు ఏ. నరేంద్ర కుమార్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవాణి మాట్లాడారు. ప్రభుత్వ ప్రధానాస్పత్రి సూపరిండెంట్ అరుణ కుమారి పాల్గొన్నారు.అనంతరం మంత్రి, జిల్లా కలెక్టర్ వైద్య విద్యను పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ వైద్య విద్యార్థులకు వైద్య పట్టాలను అందజేశారు.