Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : ఈ నెలలోనే భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

–నిడమనూరు పిహెచ్సి ఆకస్మికతనిఖీ

District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నిడమనూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా, నిడమనూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి హెచ్ సి పాతబడిపోయి, పెచ్చులు ఊడిపోతున్నందున నూతన భవన నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా ఈ భవన నిర్మాణం పూర్తయితే కొత్త భవనంలోకి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని మార్చవచ్చని, అందువలన ఈ నెలలోనే భవన నిర్మాణాన్ని పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపి, ఇన్ పేషెంట్, ఏ ఎన్ సీ రిజిస్టర్ లను, హై రిస్క్ చార్టును తనిఖీ చేసి అన్ని సక్రమంగా ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి నిడమనూరు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున అన్ని వైద్య సేవలను పి హెచ్ సి ద్వారా అందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని చెప్పారు.ప్రస్తుతం నిడమనూరు పిహెచ్సి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను ఆమె డాక్టర్ అరవింద్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.

తాసిల్దార్ కార్యాలయం తనఖీ…

జిల్లా కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నూతన రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులు, ధరణి దరఖాస్తుల పై ఆరా తీశారు.నూతన రేషన్ కార్డులకు పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చేందుకు అవకాశం ఉన్నందున ఎప్పటి దరఖాస్తులు అప్పుడే పరిశీలించి విచారణ పూర్తి చేయాలని ఆమె తహసిల్దార్ కృష్ణయ్యను ఆదేశించారు. అంతేకాక రబీ ధాన్యం కొనుగోలు కు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే కాకుండా, జాప్యం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎప్పటికప్పుడే మిల్లులకు పంపించాలని సూచించారు.