Secretary Kollu Venkateswara Rao : ప్రజా దీవేన,కోదాడ : పట్టణ పరిధిలో నిర్భయంగా పగటి పూటనే నడి రోడ్ మీదనే ఆవులను వధిస్తున్నారని, వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని నిరోధించాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు మున్సిపల్, పోలీస్, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసారు. కోదాడ పట్టణంలో ఆవుని కోసిన ఒక సంఘటనలో ఇరుగు పొరుగున నివాసం ఉన్న వ్యక్తులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కమీషనర్ దిగువ అధికారులకు చెప్పి, అంతటితో తన బాధ్యత పూర్టైనట్లు వ్యవహరించారని ఆరోపించారు.
పొరుగు వారు ఫిర్యాదు చేసారని తెలిసి ఆవుని కోసిన వారు ఫిర్యాదు చేసిన కుటుంబంలోని మహిళల మీద దాడి చేసి కొట్టారని, దాంతో వారు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ నేటి వరకు పోలీస్ లు స్పందించలేదని ఆరోపించారు. చట్టవిరుద్ద పనులను నిరోధించాల్సిన మున్సిపల్, పోలీస్ స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తూ, మరోప్రక్కన స్వచ్చందంగా బాధ్యత గల పౌరులుగా ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక అధికారులు స్పందించకుంటే సమాజంలో ఘర్షణలు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసారు. కనుక మున్సిపల్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని, ముఖ్యంగా కోదాడలో ఆవుల వధను తక్షణమే సంబంధిత అధికారులు నిరోధించాలని విజ్ఞప్తి చేసారు.