–సిపిఎం జిల్లానాయకులు
CPM District Leaders : ప్రజాదీవెన నల్గొండ : ఆదర్శ ప్రజా నాయకులు, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో అమరజీవి నర్రా రాఘవరెడ్డి 10వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో గోరంగా వైఫల్యం చెందారని, కేంద్ర ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన బారాలను మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని, రేషన్ కార్డులు, అన్ని రకాల పెన్షన్లు, ఇండ్లు ఇండ్ల స్థలాలు ఎప్పటి వరకు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇచ్చి సన్న బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను కూడా ఇవ్వాలన్నారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలును వెంట వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫ్లోరైడ్ విముక్తి పోరాటంలో ఎస్ఎల్బీసీ సొరంగంకై సాగిన పోరాటంలో నర్రా రాఘవ రెడ్డి ప్రముఖులని అన్నారు. చట్టసభలలో ఇప్పుడు జరుగుతున్న చర్చలు లాగా ఆరోజు లో లేవని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిర్భయంగా ఆ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాఘవరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ విముక్తి చేయాలనే తపనతోనే ఎస్ఎల్బీసీ సొరంగం అయితే ఆలస్యం అవుతుందని నార్ల తాతారావు వెంటబెట్టుకుని ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లి లిఫ్ట్ ద్వారా పూర్తి చేయాలని సూచించారు. అందుకు అనుగుణంగానే నేటి ఎస్ఎల్బీసీ లిఫ్ట్ స్కీమ్ అని చెప్పారు. ఏ విషయాన్నైనా కులంకూషంగా చర్చించి పరిష్కరించే వారని పేర్కొన్నారు.
ప్రజా ప్రతినిధి అంటే నర్రా రాఘవరెడ్డి లాగా నిబద్ధత కలిగి ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, మాటలు చెప్పకుండా కాలయాపన చేయకుండా ప్రజలకు పనిచేసే విధంగా ఉండాలని అన్నారు. తన జీవితమంతా పోరాటాలతో సమస్యలతో కూడుకున్నప్పటికీ వడిదుడుకు లేకుండా నమ్ముకున్న ఆశయం కోసం తుద కంట వరకు నిలబడ్డారని కొనియాడారు. ఆయన అధికారులతో చర్చించేటప్పుడు తెలుగు భాషలోనే మాట్లాడేవారని, అధికారులతో కూడా మాతృభాషలోనే ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పే వారని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి పెద్ద ఊర్లో హైస్కూలు నిర్మాణం చేయించారని, మంచినీటి సమస్య, ఆరోగ్య సమస్యలు లేకుండా చూశారని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో నాయకత్వం గాని, ప్రజలు అనారోగ్యానికి గురి అయినప్పుడు స్వయంగా వెంటబెట్టుకొని వైద్యం చేయించే వారిని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను తన సమస్యగా అనుకొని వారి సమస్యను వెంటనే పరిష్కరించిన మహనీయుడు నర్రా రాఘవరెడ్డి అని కొనియాడారు. అమరజీవి నర్రా రాఘవరెడ్డి పేరుతో షుగర్, బిపి, ఫిట్స్, పక్షవాతం రోగులకు మందులు ఇస్తున్నామని చెప్పారు. సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వర్ధంతి సభకు పుచ్చకాయల నర్సిరెడ్డి అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా నాయకులు బండా శ్రీశైలం, గంజి మురళీధర్, ఎండి సలీం, ఊట్కూరు నారాయణరెడ్డి, దండంపల్లి సత్తయ్య, నలుపరాజు సైదులు, అనురాధ, తుమ్మల పద్మ, పరిపూర్ణ చారి, కోట్ల అశోక్ రెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, నరేష్, బొల్లు వసంత కుమార్, రవీ, లింగయ్య, సైదాచారి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.