— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda collector Tripathi: ప్రజాదీవెన నల్గొండ : హాలియా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. శనివారం ఆమె నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి హాలియా మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులపై ఇంజనీరింగ్ అధికారులు, కాంటాక్టర్ తో సమీక్ష నిర్వహించారు.
ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే హాలియా మున్సిపాలిటీలో చేపట్టిన అమృత్ పనుల పురోగతి ఆశించినంతగా లేదని, అందువల్ల కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. కాగా హాలియా మున్సిపాలిటీలో 15.20 కోట్ల రూపాయల తో చేపట్టిన తాగునీటి పనులు వివిధ స్థాయిలలో పెండింగ్లో ఉండగా, వీటిపనులు వెంటనే చేపట్టి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు. పనులు ఆలస్యం చేసినందుకు గాను అమృత్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ అమృత్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పై ఉందన్నారు.ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయనందుకు గాను కాంట్రాక్టర్ కు నోటీసు లు ఇవ్వాలని చెప్పారు.
చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు గాను మున్సిపల్ కమీషనర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కాగా అమృత్ పథకం కింద హాలియ మున్సిపల్ పరిధిలో పెద్దగడిలో 200 కిలో లీటర్లు, అనుముల లో 500 కెఎల్, హై స్కూల్ వద్ద 900 కెఎల్, ఇబ్రహీం పెట్ వద్ద 300 కెఎల్ సామర్థ్యం కలిగిన ఈ ఎల్ ఎస్ ఆర్ (తాగు నీటి ట్యాంకు ల) పనులను 15.20 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది.పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సత్యనారాయణ, డిఈ శ్రీమతి మనోహర, ఏఈ సురేష్, హాలియ మున్సిపల్ కమీషనర్ రామ్ దుర్గా రెడ్డి, సబ్ కాంట్రాక్టర్ సతీష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.