–శాసనసభ్యులు జైవీర్ రెడ్డి
MLA Jaiveer Reddy :ప్రజా దీవెన నల్గొండ :అనేక భూ సమస్యలకు పరిష్కారం తహసిల్దార్, జిల్లా కలెక్టర్ పరిధిలోనే అయ్యేవిధంగా భూ భారతిలో నియమ నిబంధనలను ఏర్పాటు చేయడం జరిగిందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు.భూ భారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల లో భాగంగా ఆదివారం ఆయన త్రిపురారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై భూ భారతి చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించారు. ధరణి పోర్టల్ వల్ల పేద ప్రజలు, రైతులు ఎంతో నష్టపోయారని, గ్రామాలలో స్నేహపూరిత వాతావరణం కాకుండా, అందరూ కొట్లాడే పరిస్థితి వచ్చిందని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్, సిసిఎల్ఏ కార్యాలయాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కష్టపడ్డారన్నారు. పేద ప్రజలు ముఖ్యంగా రైతుల కష్టాలను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ధరణిలో ఎలాంటి నియమ, నిబంధనలు లేవని, అయితే భూ భారతిలో అనేక భూ సమస్యలకు పరిష్కారం తహసిల్దార్, జిల్లా కలెక్టర్ పరిధిలోని తీర్చే విధంగా నియమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూ భారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. త్రిపురారం మండలంలో తిరుమలగిరి సాగర్ మండలం లాగే అనేక భూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా పోడు సమస్యలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వీటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మేధావులతో ఆలోచించి ధరణి స్థానంలో భూ భారతిని తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు 6 గ్యారంటీలను అమలు చేయడం జరుగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు వెళ్లాల్సిన అవసరం ఉందని, అందువలన క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు వీటిని ప్రజల వద్దకు తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలన్నారు. త్రిపురారం మండలంలో ఉన్న ఆర్ అండ్ ఆర్ కాలనీల సమస్యలు, ఆర్ఓఎఫ్ ఆర్, మిస్సింగ్ సర్వే నంబర్ల సమస్యలను తీర్చాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ త్రిపురారం మండలంలోని ఆంజనపల్లి గ్రామం, 335 సర్వే నంబర్ లో విస్తృత సర్వే నిర్వహించి అనంతరం ఎఫ్ ఆర్ సి కమిటీ ని ఏర్పాటు చేసి నిజమైన వారికి హక్కు పత్రాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటివరకు సర్వేయర్ల కొరత వల్ల అంజనపల్లి 335 సర్వే నెంబర్లో సర్వే చేసి బందోబస్తు చేయలేకపోయామని చెప్పారు. భూ భారతిలో రైతుల భూములను ఆక్రమించుకునే అధికారం ఎవరికి లేదని, అలా లేకుండా శాశ్వతంగా రైతుకు భూదార్ కార్డును ఇవ్వడం జరుగుతుందని, కేవలం రైతు భూమిని అమ్మినప్పుడు మాత్రమే ఇతరుల పేరుపై వెళ్తుందని, అందువల్ల రైతులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని అన్నారు. మండలంలో ఉన్న సాదా బైనామా సమస్యలను పకడ్బందీగా పరిష్కరిస్తామని చెప్పారు. భూభారతి పోర్టల్ జూన్ 2 నుండి అమలు లోకి కి వస్తుందని, భూ భారతిలో రికార్డులను సవరణ చేసే అవకాశం ఉందని, గతంలో ధరణిలో రికార్డులను సవరించేందుకు సీసీఐఎల్ఏ వరకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం తహసిల్దార్ తోనే 80 శాతం భూ సమస్యలకు పరిష్కార వెసులుబాటు ఉందన్నారు. మండలంలోని పోడు భూములు, ఇతర భూముల సమస్య పరిష్కారానికి జులై లో సర్వే నిర్వహిస్తామన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. తహసిల్దార్ ప్రమీల, ఎంపీడీవో విజయ కుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.