— అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి
–పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలి
–నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సూచనలను తు.చ తప్పకుండా పాటించాలి
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజాదీవెన, నల్గొండ: మే 4 న నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ )అండర్ గ్రాడ్యుయేషన్ 2025 ప్రవేశ పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహణ పై బుధవారం తన చాంబర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్నారు. నీట్ 2025 ప్రవేశ పరీక్ష మే 4న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, జిల్లాలో 2048 మంది అభ్యర్థులు నీట్ ప్రవేశ పరీక్ష రాయనున్నారని, ఇందుకుగాను నల్గొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 4 పరీక్ష కేంద్రాలు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేయగా, ఎన్జీ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కేంద్రీయ విద్యాలయాలలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చేయవలసిన, చేయకూడని పనులపై జిల్లా కలెక్టర్ స్పష్టంగా వివరంగా తెలియజేశారు.
పటిష్ట బందోబస్తు బస్తు…
నీట్ పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, అలాగే పరీక్ష నిర్వహించే రోజు పరీక్ష కేంద్రాల పరిధిలో పూర్తి బందోబస్తుండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద సిసి కెమెరాల తో పాటు, బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని, నీట్ పరీక్ష కోసం ప్రత్యేకించి వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆమె ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని, ఎక్కడ ఎలాంటి తప్పు జరగకుండా పరీక్షలను సీరియస్ గా తీసుకొని నిర్వహించాలని అన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డులో లొకేషన్ తో సహా ముద్రించడం జరుగుతుందని, అందువల్ల అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకుని పరీక్షలను సవ్యంగా రాయాలని తెలిపారు. నీట్ పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1442 ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.
ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ రాజకుమార్, అడిషనల్ ఎస్పీ రమేష్, డిఎస్పి శివరామిరెడ్డి, నీట్ పరీక్ష నోడల్ ఆఫీసర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు, ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇవే నిబంధనలు…
–నీట్ ప్రవేశ పరీక్ష మే 4న మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
–అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది.
–మధ్యాహ్నం 1.30 తర్వాత ఎవరిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
–అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలు అన్నింటిని తు.చ తప్పకుండా పాటించాలి.
— ముఖ్యంగా అభ్యర్థులు ఆభరణాలు, భారీ దుస్తులు, బూట్లు ధరించి పరీక్ష కేంద్రం లోకి రాకూడదు.
–అభ్యర్థులు ఇటీవలి పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఒకటి, అలాగే 4 × 6 పోస్ట్ కార్డు సైజు కలర్ ఫోటోతో రావాలి.
–గుర్తింపు కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ లేదా కళాశాల జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా ఇతర ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలి.
–పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదు.
–జామెట్రిక్ బాక్సులు, మొబైల్ ఫోన్, బ్లూటూత్ , వాలెట్, రిస్ట్ వాచ్, కెమెరా, బెల్టు, గూగుల్స్, ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, లాగ్ టేబుల్, క్యాలిక్యులేటర్లు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదు.
— పెన్ను పరీక్ష కేంద్రంలోనే ఇవ్వడం జరుగుతుంది.