Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

May Agenda : హక్కుల కోసం పోరాట “మే” ఎజెండా

–లేబర్ కోడ్లు అమలు జరిగితే 12 గంటల పని

–ఇప్పటికే ఏళ్లతరబడి పిఆర్సిలు అమలుకాని వైనం

— నేడు కార్మికుల హక్కుల సాధన దినోత్సవం మేడే

May Agenda :ప్రజాదీవెన, నల్గొండ బ్యూరో:అనేక పోరాటాలు..ప్రాణత్యాగాల ఫలితం కార్మికవర్గం సాధించుకున్న హక్కులకు ఇపుడు పాలకుల విధానాల మూలంగా ముప్పువస్తోంది. సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటిగా
హరించుకు పోతున్నాయి. నూతన ఆర్థిక సరళీకృత విధానాలు దేశంలో అమలు మొదలయ్యాక ప్రవేటీకరణ చర్యలూ వేగవంత మయ్యాయి. ఒక్కో రంగలో చాపకిందనీరుగా ప్రవేటీకరణ మొదలైంది. ఖాళీల భర్తీ
లేకుండాపోయింది. కాంటాక్టు ఉద్యోగుల నియా మకం తెరపైకి వచ్చింది. ఇపుడు ఇదే అన్ని శాఖల్లో ఉంది. ఈ పద్దతిలో నియమించిన ఉద్యోగ కార్మికులకు ఎలాంటి హక్కులు, సౌకర్యాలు లేవు. వాటి గురించి ప్రస్తావనేలేదు. ఫలితంగా అనేక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు భద్రత లేకుండా పోయింది. ఇపుడు ఉన్నవాటిని కాపాడు కునేందుకు పోరాటాలు చేయాల్సి వస్తోంది. వేతనాలు, హక్కుల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ఎన్నికల సమయాల్లో ఇచ్చే హామీలు ఏమీ అమలు కావడం లేదు. అనేక శాఖల్లో ఖాళీలు భర్తీ కానుందున ఉన్నవారిపై అదనపు పనిభారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెస్తోన్న లేబర్ కోడ్ల వల్ల కార్మికులు ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని ఎగిరిపోనుంది. 12 గంటలు పని చేయాల్సి వస్తోంది. లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు పోరాటాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు రంగాల్లోనూ పనిగంటలు అమలు కావడం లేదు. పగలూ, రాత్రి అనే తేడా లేకుండా కార్పోరేట్ సంస్థలు ఉద్యోగులతో పని చేయించు కుంటున్నాయి. లక్షలాది మంది పనిచేస్తున్న ఈ రంగంలో కనీస హక్కులు కూడా లేవు. అడిగితే ఇంటికి పోవాల్సిందే. కారణం పాలకులు కార్మికులు కోసం ఈపాటికే ఉన్న చట్టాలను సవరించి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.

రద్దయిన సెలవు…

ఇంకా ఆందోళనకరమైన విషయ మేమిటంటే మేడే రోజున అనేక శాఖల్లో సెలవు రద్దు చేశారు. ఎప్పటి నుంచో మేడే రోజున సెలవు ఉంటుంది. కార్మికులు కార్యాలయాల ముందు ఎర్రజెండాలు ఎగరేసి సాధించుకున్న హక్కులను మననం చేసుకుంటారు. బ్యాంకులు, ఎల్ ఐ సి , పోస్టల్, టెలికం రంగాల్లో సెలవు ఎత్తేశారు. ఇక వేతన సవరణలు ఏళ్ల తరబడి పెండింగులో ఉన్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. కేంద్రం పదేళ్లుగా 8వ వేతన సవరణ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వేతన సవరణను పెండింగులో పెట్టింది. ఇక స్కీము వర్కర్లు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలలోనే ఉన్నారు. వీరికి కనీస వేతనం రూ.26 వేలు అమలు కావడం లేదు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్నం భోజనం కార్మికులు, ఆర్పిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలా అనేక రంగాల్లో వెట్టిచాకిరి చేస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ భారతిలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. ఇక పారిశ్రామిక వాడల్లో ఎక్కడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. ఇవే కాకా గ్రానైట్, ఆక్వా, పొగాకు, ప్రాసెసింగ్ యూనిట్లు, జిన్నింగు మిల్లులు అనేక రంగాల్లో కార్మిక చట్టాలు అమలు కావడంలేదు. పర్యవేక్షణ లేదు. రోజువారీ పనులు చేసుకునే భవన నిర్మాణరంగంలోనూ ఏ చట్టాలు లేవు. ట్రాన్స్పోర్టు రంగంలోనూ ఇదే పరిస్థితి. ఎక్కడా భద్రత లేదు. వేతనాలు సకాలంలో పెంచడం లేదు. ఆందోళనలు చేస్తే తప్ప గ్రానైట్ కార్మికులకు వేతనాలు పెంచడం లేదు. సమ్మెలు ఏటా తప్పడం లేదు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు చట్టాలు అమలు కావడం లేదు. పనిచేసే చోట్ల ఏం జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులూ తమ హక్కులు, సౌకర్యాలు కోసం ఆందోళనలు ఏటా చేస్తూనే ఉన్నారు. అన్నిశాఖల ఉద్యోగులు, కార్మికులు నిరంతరం ఆందోళన బాట పడుతూనే ఉన్నారు. కారణం ఈపాటికే ఉన్న సౌకర్యాలు పోతున్నాయి. భద్రతలేదు. మేడే సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు తమ హక్కులు సౌకర్యాలను మరోసారి మననం చేసుకుని వాటిని కాపాడుకునేందుకు పోరాటాలే ఎజండాగా సాగాల్సిన తరుణం ఆసన్నమైంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మిక దినోత్సవ ఏర్పాట్లు…

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. 136వ కార్మిక దినోత్సవ సంర్భంగా పెద్దఎత్తున కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉదయం నుంచే వాడావాడనా ఎర్రజెండాలను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆయా కేంద్రాల్లో ఎర్ర జెండా తోరణాలను కట్టి, అలంకరించారు.