–సమస్యపై కలెక్టర్ కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేఖ
— సానుకూలంగా స్పందించిన అధికారులు
Minority Gurukul College :ప్రజాదీవెన, నల్గొండ :నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాల గతకొంత కాలంగా తీవ్ర అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. దీంతో కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వృథా అవుతున్నాయి. అవసరమైన మౌలిక వసతలలేమి, పాత భవనంలో భద్రతా లోపాలు.. ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తును సంకటంలో నెట్టివేస్తున్నాయి.విద్యార్థులు ఏదైనా అవసరానికి బయటకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. మార్గమధ్యంలో వీధికుక్కల బెడద భవనంలో పింజర పాములు కనిపించడంలాంటి ప్రమాదకర పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయి. ఇది విద్యార్థులు, అధ్యాపకుల కు భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
విషయం తన దృష్టికి రావడంతో…
విషయం తన దృష్టికి రావడంతో పరిస్థితిని గమనించిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విద్యార్థుల భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ కు గురువారం ప్రత్యేక లేఖ రాశారు. ఆ లేఖను బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి చంద్రశేఖర్ స్వయంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ కు అందజేశారు. విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కళాశాల బదిలీకి సంబంధించి సానుకూల సంకేతాలు వెలువడటం ఉద్యమ విజయానికి తొలి మెట్టుగా భావించవచ్చని చంద్రశేఖర్ తెలిపారు. బీసీ సమాజ్ సూచన మేరకు, కళాశాలను నాగార్జునసాగర్ పైలాన్ ప్రాంతంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ బీఈడీ కళాశాల భవనంలోకి బదిలీ చేయాలని కోరారు. ఈ బదిలీ వల్ల విద్యార్థులకు భద్రతా ప్రమాణాల పెంపు జరుగుతుందని, అడ్మిషన్ల సంఖ్య కూడా పెరుగుతుందని, విద్యార్థులకు కావలసిన నాణ్యమైన మౌలిక వసతులు అందుతాయని ప్రభుత్వా నిధులు సమర్థవంతంగా వినియోగించబడతాయని, పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ను కలిసిన వారిలో బీఎస్పీ పార్టీ నల్గొండ అసెంబ్లీ ఇన్చార్జి యాదగిరి, బుడియాపాక లక్ష్మయ్య, బుడిగపాక సత్యనారాయణ, నిమ్మనగోటి నాగరాజు, నిమ్మనగోటి శీనయ్య తదితరులు పాల్గొన్నారు.