–ఎమ్ఎస్ఓ ల దే పూర్తి బాధ్యత
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Indiramma Houses to Ineligible : ప్రజాదీవెన నల్గొండ :అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లలో అనర్హులు రాకుండా మండల ప్రత్యేక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జాబితాలో ఒక్క శాతం అనర్హులు ఉండరాదని, ఒకవేళ ఉన్నట్లయితే ఎమ్ ఎస్ ఓ (మండల స్పెషల్ ఆఫీసర్) దే పూర్తి బాధ్యత అని అన్నారు. ఎలాంటి అధికారిక, రాజకీయ వత్తిడులకు లోను కాకుండా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని, రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు ఇవ్వడం ఒక గొప్ప విషయమని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్దనుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇది వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారికి తిరిగి రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అర్హత ఉండదని స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాస పథకం లక్ష్యాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ వారాంతానికి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించిన దర్తి ఆబా యోజన పథకం ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో పంపించాలని ఆదేశించారు. ఈ నెల 12న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శిస్తున్న దృష్ట్యా బుద్ధవనం, విజయ విహార్ ల వద్ద శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా ఆహ్వానం పలకాలని స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ ను ఆదేశించారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పునరుద్ఘాటించారు.
ప్రత్యేకించి ఎండలో పని చేసే వారికి సౌకర్యాలను కల్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. పనిచేసే చోట నీడ, తాగునీరు, ఓ ఆర్ ఎస్ పాకెట్లు ఉంచాలని తెలిపారు. నీట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. కాగా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. ఈ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ అప్పటీకప్పుడే కొన్ని పరిష్కరించగా, మరికొన్నిటిని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి పంపించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, నల్గొండ ఇన్చార్జి డిఆర్ఓ, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.