Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

May 20 General Strike : మే 20న జరుగు సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

–రైతు సంఘం జిల్లా విస్తృత సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపు

May 20 General Strike :ప్రజాదీవెన నల్గొండ :2025 మే 20న జరిగే సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పునిచ్చారు. శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్ లో రైతు సంఘం నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షులు జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మే 8 నుండి 15 వరకు జీపుజాతాలు, సైకిల్‌ మోటార్‌ ర్యాలీలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని, మే 16 నుండి 19 వరకు గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లు కార్మికులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి పోరాడి సాధించుకున్న 29 చట్టాలను వమ్ముచేస్తూ కార్పోరేట్‌ యాజమాన్యాలకు అనుకూలంగా రూపొందించారని, ఏ హద్దూ అదుపూలేని ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుంది.గతంలో రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిదని విమర్శించారు. కేంద్రప్రభుత్వం స్వామినాథన్‌ కమిషన్‌ సూచించినట్టు సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి-2)కు 50శాతం కలిపి మద్ధతు ధరను నిర్ణయించాలని, ఇది రైతులకు చట్టపరంగా దొరకాలని, దీనికి అనుగుణంగా వ్యవసాయోత్పత్తుల సేకరణ కొనసాగాలని డిమాండ్‌ చేశారు.

 

రైతుల రుణాలన్నీ మాఫీచేసి రుణ విమోచన చట్టం చేయాలని, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని, విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భారత అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నందువల్ల ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. అదే విధంగా ఉపాధి హామీ పథకం పనిరోజులను 200 రోజులకు పెంచాలని, కూలి రోజుకు రూ.600 లకు పెంచాలని, వ్యవసాయ కార్మికులకు కనీస పెన్షన్‌ను రూ.10,000ల పెంచాలని డిమాండ్‌ చేశారు. స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వలస కార్మికులు, కౌలు రైతుల హక్కులను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సమగ్ర రుణమాఫీ చేయాలని, ఆరు పంటలకు బోనస్ ఇవ్వాలని, నాలుగు గంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని, పంటల బీమా పథకాన్ని రూపొందించాలని, రైతు భరోసా కౌలు రైతులతో సహా అర్హులైన అందరికీ పంటకు ఎకరానికి రూ.7,500 ఇవ్వాలని, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని, 2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు రుణార్హత కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు వడగళ్ల వానకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, వరి కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థి, యువజన, మహిళ, ఆదివాసి, గిరిజన, మైనారిటీ, సామాజిక సంఘాలతో పాటు మేధావులు, విద్యావంతులు, రాజకీయ పార్టీలు ఈ సమ్మె, గ్రామీణ బందుకు సంపూర్ణ మద్దతును తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండ శ్రీశైలం, నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, రామిరెడ్డి కృష్ణారెడ్డి, ఊర్మిళ, తదితరులు పాల్గొన్నారు.