చకచకా చట్ట సవరణ
–బడ్జెట్ సేషన్ లోనే చట్టసవరణ బిల్లులు
–రాష్ట్రంలో అడ్డగోలు అడ్మిషన్లపై కఠిన ఆంక్షలు
–ఇకపై ప్రయివేటు వర్సిటీల వ్యాపారానికి చెల్లు
–పలు వివాదాల్లో అనురాగ్, మల్లారెడ్డి విశ్వవిద్యాలయాలు
ప్రజా దీవెన / హైదరాబాద్: తెలంగాణలో కుప్పలుతెప్పలుగా వచ్చి పడిన ప్రైవేట్ యూనివర్సిటీ లపై కొరడా జులిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక చర్యలకు ఉపక్రమిస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పక్క ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇందుకు సంబంధించి చట్టాన్ని సైతం సవరించాలని తీవ్రమైన కసరత్తు ప్రారంభించిన తెలుస్తుంది. మరో వైపు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లనూ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా వాటి నియంత్రణకు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల వ్యాపారానికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం తీవ్రాతి తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. యాజమాన్యాల ఇష్టారాజ్యానికి పుల్ స్టాప్ పెట్టేందుకు, అడ్డగోలు అడ్మిషన్లకు చరమగీతం పాడేందుకు చట్టాన్ని కూడా సవరించాలని భావిస్తున్నది.
వచ్చే అకడమిక్ (2024-25) ఇయర్ రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. మరోవైపు రెవెన్యూ శాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీలపై చర్యలు చేసుకునేందుకు కూడా వెంకాడేది లేదని ఆయా వర్గాల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది.
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రైవేట్ వర్సిటీల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేకపోగా నిర్దేశించిన ఫీజు చెల్లించిన వారికి అడ్మిషన్లు ఇస్తున్నారు. దీంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కావాల్సిన చట్ట సవరణ చేయాలని సర్కారు భావిస్తున్నది.
ఫిబ్రవరిలో నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లుకు ఆమోదం తీసుకుని, 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లను అమలు చేయాలని లక్ష్యoగా పెట్టుకున్నట్టు సమాచారం. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రైవేటు వర్సిటీల్లో అమలవుతున్న రిజర్వేషన్లు, వర్సిటీల కార్యకలాపా లపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం వర్సిటీల్లో ఏ కోర్సుకు ఎంత ఫీజు ఉండాలనే అంశంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోగా పూర్తిగా వర్సిటీల యాజమాన్యాల పరిధిలోనే ఉన్నదని, దీంతో లాభాలే టార్గెట్గా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తున్నది. స్టూడెంట్స్ కు అందుతున్న సౌకర్యాలు, వసూలు చేస్తున్న ఫీజుల మధ్య పెద్ద ఎత్తున తేడా ఉన్నట్టు ప్రభుత్వానికి అందిన రిపోర్టులో వెల్లడైనట్టు తెలిసింది.
చాలా కోర్సుల్లో క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ లేదని గుర్తించినట్టు సమాచారం. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్పుడు ఫీజు నియంత్రణ లేకుండా యాజమాన్యాల ఇష్టారాజ్యానికి వదిలేసిందని విమర్శలు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఫీజుల విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.
ఆ భూములను వెనక్కి తీసుకోవడంతోపాటు. నిబంధనలు ఉల్లంఘించినందుకు వర్సిటీలపై చర్యలు తీసుకునే చాన్స్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. నియంత్రణ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ కమిటీల సిఫార్సుల మేరకు ఫీజులను నిర్ధారిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వర్సిటీల్లో కూడా ఫీజు నిర్ధారణ అనేది నియంత్రణ కమిటీల పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తు న్నట్టు తెలిసింది.