Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Panchayat Raj Department Director Ravinder: ముఖం చూపాల్సిందే.!

–జడ్పీ ఉద్యోగుల హాజరుపై నజర్

–విధులకు డుమ్మా కుదరధిక

— అమలు రేపటి నుండే

— ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ రవీందర్

Panchayat Raj Department Director Ravinder: జిల్లా, మండల పరిషత్ లలో పని చేసే ఉద్యోగుల హాజరు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ముఖగుర్తింపు పరికరాలను బిగించారు. పని వేళల్లో వచ్చే సిబ్బంది, అధికారులు తమ హాజరును ముఖ గుర్తింపు ద్వారా నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 16 నుంచి అమల్లోకి వస్తోందని పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ పి.రవీందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ గుర్తింపు ద్వారా ఆధార్ నమోదు చేసుకోవాలని ఆదేశాలు రావడంతో ఆయా కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారుల వివరాలను సాఫ్ట్వేర్ లో నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానం ద్వారా కార్యాలయ పనివేళలు తప్పనిసరి అమలు అవుతాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

ప్రజాదీవెన నల్గొండ బ్యూరో : మండల, జిల్లాపరిషత్తు కార్యాలయాల్లో అధికారుల సేవలు పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ఆయా కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రవీందర్ ఈ విధానాన్ని ఈనెల 16 నుంచి అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నల్గొండ జిల్లాలోని జడ్పీ, మండల పరిషత్తు కార్యాలయాల్లో ముఖ హాజరు విధానాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

—ప్రస్తుతం ఆఫ్లైన్లోనే..

గతంలో ఆయా కార్యాలయాల్లో వేలిముద్ర హాజరు ఉండేది. అది సక్రమంగా పనిచేయకపోవడంతో ఏళ్ల తరబడి పరికరాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం ఆఫ్లైన్ హాజరు విధానం కొనసాగుతోంది. కార్యాలయాల సిబ్బంది ఆలస్యంగా వచ్చినా, తొందరగా వెళ్లినా దస్త్రాల్లో సమయం నమోదుకాదు. రోజంతా విధులు నిర్వర్తించినట్లే చూపిస్తుంది. దీంతో చాలా మంది కార్యాలయ సిబ్బంది విధుల పట్ల జాప్యం వహించడం, తరచుగా ఎగనామం పెట్టడం, ఇంటికెళ్లడం, విధులకు రాకపోయినా వచ్చినట్లు సంతకాలు చేయడం తదితరాలు చోటుచేసుకుంటుండటంతో సిబ్బంది నుంచి మెరుగైన సేవలు అందడం లేదని రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. ఇలా వ్యవహరించే ఉద్యోగులపై ఇక ప్రత్యేక నిఘా ఉండనుంది. ఏకంగా ముఖ గుర్తింపును అమల్లోకి తీసుకొస్తున్నారు. జిల్లా పరిషత్తు కార్యనిర్వాహక అధికారులు దీనికి అవసరమైన బయోమెట్రిక్
పరికరాలను ఏర్పాటు చేసి కొత్త విధానాన్ని అమ ల్లోకి తీసుకురావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

–ఉద్యోగుల వివరాల సేకరణ…

ముఖ గుర్తింపు హాజరు విధానం కోసం జిల్లా మండల పరిషత్ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగులకు సంబంధించిన ఆధార్ కార్డ్ వివరాల సేకరణ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇది పూర్తవగానే కొత్త విధానం అమల్లోకి వస్తుంది. సిబ్బంది విధుల్లో చేరినప్పుడు కార్యాలయ సమయం ముగియగానే ఇంటికి వెళ్లేటప్పుడు రెండుసార్లు ముఖచిత్రంతో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి జిపిఎస్ ను అనుసంధానం చేస్తారు. ఇలా నమోదైన రోజు వారి హాజరు నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపుతారు.

— గడువులోగా ఏర్పాటు…
రాష్ట్రస్థాయి అధికారులు నిర్ణయించిన గడువులోగా కొత్త హాజరు విధానానికి సంబంధించి పరికరాలను కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐతే ముఖ చిత్రం హాజరుతో ప్రజలకు సేవలు మరింత పారదర్శకంగా అందే అవకాశం ఉంది.