Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rythu Bharosa : ఆనందంలో “అన్నదాతలు”

–రైతుకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం

–రైతు ఖాతాలో నిధుల జమ

–తొమ్మిది రోజుల్లో ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడి

–గడిచిన 14 సీజన్లలో కలిపి 8357.26 కోట్లు మంజూరు

–ఈ వానాకాలంలో 5.65 లక్షల మందికి రూ.738.67 కోట్లు కేటాయింపు

— హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు

ప్రజా దీవెన, నల్గొండ బ్యూరో:
Rythu Bharosa: వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాగు ఖర్చుల నిమిత్తం అందించే రైతు భరోసా విధుల కోసం జిల్లాలో రైతుల జాబితాను ఇప్పటికీ అదికారులు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం లాంఛనంగా నిధులు విడుదల చేయడంతో మంగళవారం నుంచి రైతు ఖాతాల్లో జమ అవుతున్నాయి.

వానాకాలం పనులు కొనసాగుతున్న ఈ సమయం లో రైతులకు భరోసా నిధులు జమ కానుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తొమ్మిది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట ప్రభుత్వం ప్రకటించడంతో ఈ వానాకాలానికి పూర్తిస్థాయిలో ఎలాంటి ఇబ్బం దులు లేకుండా రైతు భరోసా నిధులు అందు తాయని రైతులు బావిస్తున్నారు.

ఏడాదికి రూ. 12 వేలు:
రైతులకు సాగు ఖర్చులకు నిధులు అందిచాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబందు పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదటి సారిగా 2018 సంవత్సరం యాసంగిలో రైతు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసింది. ప్రతి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.8 జమ చేసింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలకు పెంచింది.

ఆ తర్వాత 2023లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలకు పెంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్ కు సంబంధించి జిల్లాలో 565803 మంది రైతులతో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయగా వానకాలానికి సంబంధించి 738 కోట్ల 67 లక్షల 60 వేల 63 రూపాయలు మంజూరయ్యాయి. కాగా గత 14 సీజన్లకు సంబంధించి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 8357 కోట్ల 26 లక్షల 63 వేల 748 రూపాయలు మంజూరయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా నిధులు విడుదల చేయడంతో నల్లగొండ జిల్లాలోని 385318 మంది రైతుల ఖాతాలో సోమవారం నుండి మంగళవారం సాయంత్రం వరకు కేవలం 48 గంటల వ్యవధిలో 303 కోట్ల 72 లక్షల 9 వేల 557 రూపాయలు రైతు ఖాతాలో జమయ్యాయి.

తక్షణం ఖాతాలు ఇవ్వండి:
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 9500 మంది రైతులు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఉన్నారు. వారంతా తక్షణమే వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి వారి బ్యాంకు ఖాతాలను అందజేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వారు ఖాతాలు అందజేస్తే వారి ఖాతాలలో కూడా రైతు భరోసా నిధులు జమ అవుతాయని తెలిపారు. కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్నవారు విషయాన్నీ గమనించాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు..
శ్రవణ్ (జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నల్గొండ): పెట్టుబడి సాయం ఈసారి ముందస్తుగానే వచ్చింది. రైతుల విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. నేరుగా వారి ఖాతాలోనే డబ్బులను జమ చేస్తుంది. పెట్టుబడికి కావలసిన సరైన సమయంలోనే డబ్బులు జమవుతున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు.

రైతులు పెట్టుబడి సాయాన్ని వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటే మేలు జరుగుతుంది. గడిచిన 24 గంటల సమయంలోనే సుమారు 400 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.