— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Ila Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: న్యాయ స్థానాల్లో విచారణలో ఉన్న సివిల్ కేసుల్లో పంచాయతీ కార్యదర్శులు జో క్యం చేసుకోకూడదని జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.ఒక వేళ ఎవరైనా పం చాయతీ కార్యదర్శి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన మైన క్రమశిక్షణ చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సివిల్ వివాదాల్లో, ముఖ్యంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో జోక్యం చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో, న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుండగానే పంచాయతీ కార్యదర్శులు వివాదాస్పద స్థలాల్లో/ఇళ్లలో ఇంటి నంబర్లు కేటాయించడం లేదా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల గ్రామస్థాయిలో న్యాయపరమైన సంక్లిష్టతలు పెరిగి, వివాదాలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు.
ఈ రకమైన చర్యలు అనధికారికమైనవిగా, పరిపాలనా హోదాకు అతీతమైనవిగా పరిగణించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇవి న్యాయ ప్రక్రియలకు భంగం కలిగించడమే కాకుండా, పంచాయతీరాజ్ శాఖకు ,జిల్లా యంత్రాంగాయానికి అనవసరమైన న్యాయ పరమైన సమస్యలను తెచ్చిపెడుతున్నాయని,అలాగే ప్రజలనుండి విమర్శలను తెచ్చిపెడతాయని పేర్కొన్నారు. అందువల్ల పంచాయతీ కార్యదర్శులు వివాదాస్పద ప్రాంతాల్లో/ఇళ్లలో లేదా లిటిగేషన్ ఉన్న సందర్భాల్లో ఇంటి నంబర్లు లేదా ఆస్తి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. ఇలాంటి అనధికారిక చర్యలను జిల్లా యంత్రాంగం ఇకపై సహించబోదని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ విషయంపై ఎం పి డి ఓ లు,ఎం పి ఓ లు పై సూచనల పై పంచాయతీ కార్యదర్శులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.