— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ : అంబ భవాని ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఆమె వైజాగ్ కాలనీ వద్ద ఉన్న అంబ భవాని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏవైనా అడ్డంకులు, ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని ఇంజనీరింగ్ అధికారులతో కోరారు.
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, భూసేకరణ సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.కాగా నాగార్జునసాగర్ ప్రాజక్ట్ నీటి ఆధారంగా 11 గ్రామాలలోని సుమారు 13 వేల 48 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను 184 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అంబ భవాని ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు అప్రోచ్ కెనాల్ పూర్తికాగా, పంపు హౌస్ దాదాపు మూడోవంతు పూర్తయింది. ప్రెసర్ మెయిన్ పైపులైను ప్రస్తుతం పనులు నడుస్తుండగా, అన్ని పనులు పురోగతిలే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆగస్టు నాటికి సాగునీటిని అందించాలని లక్ష్యంగా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు.
ఈ లిఫ్ట్ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడమే కాకుండా ఇంజనీరింగ్ అధికారులు, ప్రాజెక్టు ఏజెన్సీ తో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఇటీవలే జిల్లా కలెక్టర్ భూసేకరణపై 32 లక్షల రూపాయలను విడుదల చేయగా శాసన సభ్యుల ఆధ్వర్యంలో రైతులకు చెక్కులు పంపిణీ చేసిన విషయం విదితమే. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి,ప్రాజెక్టు సూపరింటిండెంట్ ఇంజనీర్ బద్రు నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలమందయ్య, డిప్యూటీ ఇంజనీర్ ప్రభాకర్, ఏఈ శివరాజ్ , ప్రాజెక్టు మేనేజర్ దినేష్, రమేష్,
నేరేడు గోమ్మ తహసిల్దారు, తదితరులు ఉన్నారు.