–జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి
District Collector Ila tripathi: ప్రజాదీవెన నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉపకులపతి ఆచార్య కాజా అల్తా హుస్సేన్ లు ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా చేపట్టిన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం వేదికగా డిగ్రీ, పీజీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం మూడు సంవత్సరాల ఒప్పంద పత్రాలను రిజిస్టర్ ఆచార్య అలువాల రవి వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ప్రదీప్ లు పరస్పరం పంచుకున్నారు.
ఈ శిక్షణ తరగతుల్లో నైపుణ్య అభివృద్ధి, మెంటరింగ్ ద్వారా సివిల్స్ పై అవగాహన, ప్రధాన ఉద్దేశాలుగా చరిత్ర నైతిక విలువలు పాలిటి భారతీయ సమాజం పరిపాలన ఆర్థిక వ్యవస్థ మూర్తిమత్వo, అంతర్జాతీయ సంబంధాలు వంటి మొత్తం 12 అంశాలలో విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ విద్యార్థులు చంచల స్వభావాన్ని వీడి స్పష్టమైన అవగాహనతో సమయపాలన నిరంతర పరిశ్రమతో విజయాలు అందుకోవాలని సూచించారు. అవాంతరాలను అధిగమిస్తూ నిర్మాణాత్మక ఆలోచన విధానాన్ని అలవర్చుకొని విజయ పాదములో ముందుకు సాగాలని సూచించారు. సమాజం పట్ల బాధ్యత, మానవీయ సమాజ నిర్మాణ లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు తమ ఐక్యక అంశాలను గుర్తించి వాటిలో నిష్ణాతులుగా తయారైతే విజయం సొంతమని తెలిపారు.
యూపీఎస్సీ సాధనలో తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సహనం, కరుణ, స్వీయ క్రమశిక్షణ వంటి సుగుణాలను అలవర్చుకొని ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి యాజమాన్యం ఎప్పుడు సిద్ధమని విద్యార్థులు అధ్యయనంపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సంస్థ చైర్మన్ కృష్ణ ప్రదీప్, చీఫ్ మెంటర్ భవాని శంకరులు శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను విద్యార్థులకు వివరించారు.
స్థిరత్వం, కరుణ సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి అంశాన్ని పలు కోణాల్లో పరిశీలించే నైపుణ్యం శక్తి సామర్థ్యాలు అలవర్చుకున్నప్పుడే యూపీఎస్సీ సాధన సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఆలువాల రవి, స్టూడెంట్ వెల్ఫేర్, ఇండస్ట్రీ కనెక్ట్ డైరెక్టర్ డా. సురేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ సిహెచ్ సుధారాణి, కె. అరుణప్రియ, డా ప్రేమ్సాగర్, డా. మద్దిలేటి, డా. లక్ష్మీ ప్రభ, డా. అనితా కుమారి, డా ఇందిరా, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.