BJP vs MIM: అధికారం వస్తే కాళ్లపై పడుతారు
ఒవైసీ సోదరుల భవితవ్యాన్ని తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీ కాళ్లపై పడతారని ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
అక్బరుద్దిన్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
ప్రజాదీవెన, హైదరాబాద్: ఒవైసీ సోదరుల భవితవ్యాన్ని తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీ కాళ్లపై పడతారని ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. వీటి తోడుగా ఎంఐఎం కూడా కీలక విమర్శలు చేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
తమను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఒవైసీ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. ఒవైసీ సోదరులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నదమ్ములిద్దరూ తమ కాళ్లపై పడతారని జోస్యం చెప్పారు. వారిద్దరిని ఏమి చేయాలో తాము అప్పుడు నిర్ణయిస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓవైసీ బ్రదర్స్ అనుకున్నట్లుగా ఎలాంటి చర్యలకు పాల్పడమని అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడేందుకు ఇంకా నాలుగేళ్లుందని.. అప్పటి వరకు మీకు ఇష్టం వచ్చినట్లు ఉండాలన్నారు.4 దశాబ్దాలుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంఐఎం పార్టీ చేసిందేమీ లేదని.. కేవలం అక్కడి స్థానికుల మనోభావాలను ఆకర్షించడం ద్వారా ఓల్డ్ సిటీ ఓటర్లను తమవైపుకు తిప్పుకుని గెలుస్తున్నారంటూ రాజా సింగ్ ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) అసదుద్దీన్ను గెలిపించుకోవడం కోసం ప్రతిసారీ మీరు వేసే వ్యూహం ఇదే అని ఓవైసీ బ్రదర్స్ను ఉద్దేశించి రాజా సింగ్ అన్నారు. ఇన్నేళ్లలో హైదరాబాద్లోని ఓల్డ్ సిటీకి ఎంఐఎం ఎలాంటి అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యే రాజా సింగ్ అక్బరుద్దీన్ ఒవైసీని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో జతకట్టి మీ ఉనికిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే చాలా మందితో ఇలా సత్సంబంధాలు కురుర్చుకున్నారని గతాన్ని గుర్తుచేశారు.
MLA Rajasingh fire on MIM leaders