Courageous adventures in mortal danger ప్రాణాపాయస్థితిలోనే ధైర్య సాహసాలు
-- వంతెనపై గాలిలో వేలాడుతూనే 100కు డయల్ చేసిన 13ఏళ్ల బాలిక --ఇద్దరు పిల్లలు సహా మహిళను గోదాట్లోకి తోసేసిన ప్రియుడు -- తల్లి, చెల్లి గల్లంతైనా పైప్ పట్టుకుని బయటపడ్డ లక్ష్మీకీర్తన
ప్రాణాపాయస్థితిలోనే ధైర్య సాహసాలు
— వంతెనపై గాలిలో వేలాడుతూనే 100కు డయల్ చేసిన 13ఏళ్ల బాలిక
–ఇద్దరు పిల్లలు సహా మహిళను గోదాట్లోకి తోసేసిన ప్రియుడు
— తల్లి, చెల్లి గల్లంతైనా పైప్ పట్టుకుని బయటపడ్డ లక్ష్మీకీర్తన
ప్రజా దీవెన/అంబేద్కర్ కోనసీమ: గాలిలో నిండు నూరేళ్ళ జీవితం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఓపక్క ప్రాణాలు పోతాయన్న భయo దానికి తోడు మరోపక్క తల్లి, చెల్లి గోదావరిలో కొట్టుకుపోయారన్న బాధ వెరసి ఆపదలో ఉన్న అమ్మాయి చూపిన ధైర్య సాహసాలు తెలివితేటలు ఔరా అనిపించక మానదు.
చిమ్మచీకటిలో వంతెనపై వేలాడుతూ తాను బతుకుతానో లేదో అన్న ఆవేదన ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా జీవితంపై ఆశలువదిలేసుకుంటారు కాని గుండెల నిండా ధైర్యం నింపుకొన్న 13 ఏళ్ల బాలిక సమయస్ఫూర్తితో ఆలోచించి 100కు డయల్ చేసి ప్రాణాలు దక్కించుకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న ఉలవ సురేశ్తో పుష్పాల సుహాసిని (35) అనే మహిళ సహజీవనం చేస్తోంది. వీరి కుమార్తెలు లక్ష్మీకీర్తన(13), జెర్సీ (1) . ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో వారిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి పాత వంతెన వద్దకు తీసుకెళ్లిన సురేశ్ అనే వ్యక్తి ఆ ముగ్గురినీ వంతెనపై నుంచి గోదావరిలోకి తోసేశాడు.
సుహాసిని, జెర్సీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా లక్ష్మీకీర్తన బ్రిడ్జి గోడకు అడుగున ఉన్న పైపు పట్టుకుని గాలిలో వెళ్ళడుతున్నాయి. ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు 100కు డయల్ చేయాలనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే తన సెల్ఫోన్ నుంచి 100కు డయల్ చేసి రక్షించాలని కోరింది. వెంటనే స్పందించిన ఎస్ఐ వెంకటరమణ నేషనల్హైవే సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాపకు ధైర్యం చెబుతూ ఆమెను కాపాడారు. అంతటి విపత్కర పరిస్ధితుల్లోనూ ధైర్యం కూడగట్టుకుని సెల్ఫోన్ సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఆలోచన చేసిన లక్ష్మీకీర్తన ధైర్యాన్ని పలువురు కొనియాడారు.