తెలంగాణ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా…!
— ఎన్నికల నిర్వహణకు ఈసారి 500 కోట్లు
— రాష్ట్రానికి ఎన్నికల కమిషన్ లేఖ
ప్రజా దీవెన /న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చు అంచనా తెలిస్తే వామ్మో అనిపించక మానదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపిందని, ఆ నిధులను విడుదల చేయాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సుమారు రూ.370 కోట్ల వరకు ఖర్చయిందని అధికార వర్గాలు తెలియజేస్తుండగా ఈసారి 30 శాతం ఖర్చు ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.అసెంబ్లీ ఎన్నికల ఖర్చును ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉండగా ఈవీఎం మిషన్ల సేకరణ, నిర్వహణ, భద్రపరచడం వరకు అయ్యే ఖర్చును ఎన్నికల సంఘం చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్నికల నామినేషన్ మొదలు, ఫలితాలు వచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించే స్టాఫ్, పోలీసులకు ట్రాన్స్పోర్టు, అలవెన్సులు చెల్లించాల్సి ఉంటుంది. పోలీసులు, పోలింగ్ స్టాఫ్కి పెద్దఎత్తున ఖర్చు అవుతుందని అధికారులు వెల్లడించారు. గతంలో పోలింగ్ రోజున అలవెన్సుల విషయంలో ఎంప్లాయీస్ ఆందోళనలు చేసిన సందర్భాలున్నాయి. దీంతో అలవెన్సులు ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.