మహిళా మంత్రిపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల వేళ మహిళా మంత్రిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్, కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్కు చేసిన సూచన రాజకీయంగా సంచలనం సృష్టించింది.
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వైనం
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం
ప్రజాదీవెన, కర్ణాటక: లోక్సభ ఎన్నికల వేళ మహిళా మంత్రిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్, కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్కు చేసిన సూచన రాజకీయంగా సంచలనం సృష్టించింది. కర్ణాటక మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత సంజయ్ పాటిల్ నోరు పారేసుకున్నారు. బెలగావి లోక్సభ స్థానం నుంచి మంత్రి లక్ష్మి తనయుడు మృణాల్ హెబ్బాల్కర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంజయ్ ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ.. బీజేపీకి మహిళల మద్దతు పెరుగుతుండటంతో మినిస్టర్ హెబ్బాల్కర్లో ఆందోళన మొదలైందన్నారు.
ఆమెకు నిద్ర సరిగ్గా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అందుకు స్లీపింగ్ పిల్స్ లేదా ఓ పెగ్ వేసుకోవాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు సంజయ్. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి హెబ్బాల్కర్.. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదా అని ప్రశ్నించారు. ‘ఇది మహిళలకు BJP ఇచ్చే గౌరవం.. బీజేపీ రహస్య అజెండా ఇదే.. మీరు శ్రీరామ్, బేటీ పఢావో బేటీ పచావో(Beti Padhao Beti Bachao) అని పదే, పదే చెప్పుకుంటే సరిపోదు. ముందు మహిళలను గౌరవించాలి.. అది మన హిందూ సంస్కృతి. హిందూ సంస్కృతి గురించి.. పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే సంజయ్ పాటిల్ కామెంట్స్ నన్నే కాదు రాష్ట్రం, దేశంలోని మహిళలందరినీ కించపరచడమే’ అని ఆమె ఉద్వేకభరితంగా రిప్లై ఇచ్చారు.
ఇదిలావుంటే, పాటిల్ ప్రకటనపై కర్ణాటక కాంగ్రెస్ బిజెపిని లక్ష్యంగా చేసుకుంది. లక్ష్మి హెబ్బాల్కర్పై వ్యాఖ్యానించడం ద్వారా సంజయ్ పాటిల్ మహిళలను అవమానించారని పేర్కొంది. బీజేపీలో మహిళా వ్యతిరేక వైఖరి పెరుగుతోందని దీన్ని బట్టే అర్థమవుతోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. బీజేపీ, జేడీఎస్ పార్టీల పతనం మొదలైంది, అందుకే వారి మహిళా వ్యతిరేక వైఖరి పెరుగుతోంది. కౌరవులు, రావణుడిలానే బీజేపీ, జేడీఎస్లు కూడా కచ్చితంగా నాశనం అవుతాయంటూ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు శాపనార్థాలు పెట్టారు.
హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ బెలగావి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్పై లోక్సభ ఎన్నికల్లో(Parliament elections) పోటీ చేస్తున్నారు. కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న, మళ్లీ మే 7న ఇక్కడ ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కర్ణాటకలో ప్రధానంగా కాంగ్రెస్, ఎన్డీయేల మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. కాగా, ఒక సీటు జేడీఎస్కు దక్కగా, ఒక సీటు మరొకరు గెలుచుకున్నారు.
MLA inappropriate comments on women minister