Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

బాలరాముడికి లక్ష మఠడీల నైవేద్యం

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరగనున్న మొదటి శ్రీ రామనవమి వేడుకల కోసం దేశం మొత్తం సిద్ధమవుతోంది.

రామనవమిన భక్తులకు మహాప్రసాదం
కల్యాణ వేడుకలకు దేశం మొత్తం సిద్ధం
పురాతన కృష్ణుడి ఆలయం నుంచి తరలింపు

ప్రజాదవెన, అయోధ్య: ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో (ayodhya ram mandir) శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరగనున్న మొదటి శ్రీ రామనవమి వేడుకల కోసం దేశం మొత్తం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్​ నాథ్​ద్వారాలోని శ్రీనాథ్‌జీ అనే ఓ పురాతనమైన శ్రీ కృష్ణుడి ఆలయం నుంచి తొలిసారి ‘మఠడీ’ అనే మహాప్రసాదాన్ని అయోధ్య రాముడి కోసం తరలించారు. దీనికి సంబంధించిన యాత్ర శ్రీనాథ్‌జీ ఆలయం నుంచి ఆదివారం ప్రారంభమైంది. ఏప్రిల్​ 17 బుధవారం శ్రీ రామనవమి(ram navami) రోజున ఇది అయోధ్యకు చేరుకుంటుంది. అక్కడ బాలక్​రాముడికి ఈ మఠడీ ప్రసాదాన్ని నివేదించిన తర్వాత గుడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచనున్నారు. ఈ మేరకు లక్ష మఠడీల మహాప్రసాదాన్ని అయోధ్యకు పంపినట్లు శ్రీనాథ్‌జీ ఆలయ నిర్వాహకులు తెలిపారు.

నాథ్​ద్వారా నుంచి ప్రారంభమైన మఠడీ మహాప్రసాదం యాత్ర భిల్వారా, జైపూర్​, మథుర జాతిపుర, లఖ్​నవూ మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది. అయితే రామనవమి సందర్భంగా అయోధ్యలో పంచనున్న ఈ మఠడీ ప్రసాదాన్ని ఇదే రోజు శ్రీనాథ్​జీ ఆలయంలోనూ ఉచితంగా పంచనున్నారు. ఇక్కడ 11 వేల మఠడీలను భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏంటీ శ్రీనాథ్‌జీ మఠడీ మహాప్రసాదం?
‘మఠడీ’ పేరుగల ఆహార పదార్థాన్ని శ్రీ కృష్ణుడికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఇది ఓ ప్రత్యేకమైన వంటకం. దీనిని ఉదయ్​పుర్​ నాథ్​ద్వారాలోని శ్రీ నాథ్​జీ ఆలయంలో మాత్రమే తయారు చేస్తారు. దేశంలో మరే ఆలయంలో కూడా ఈ ప్రసాదం కనిపించదు. ఈ ప్రసాదాన్ని గోధుమ పిండి, పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పంచదార పాకంతో తయారు చేస్తారు. అయితే ఈ మఠడీ ప్రసాదం త్వరగా పాడవ్వకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందట.

అయోధ్య పరిసరాల్లో భారీ బందోబస్తు
జనవరిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి రామనవమి వేడుకల కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో అయోధ్యకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యోగీ సర్కార్​ అయోధ్య పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. 560 సీసీటీవీ కెమెరాలతో ఆలయం పరిసరాలను నిరంతరం కంట్రోల్​ రూమ్​ల నుంచి పర్యవేక్షించనున్నారు పోలీసులు. మరోవైపు రామనవమి వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

 

వీఐపీల దర్శనాలకు బ్రేక్​

శ్రీ రామనవమిని (sri ramanavami) పురస్కరించుకొని అయోధ్యకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా 4 రోజుల పాటు అంటే ఈనెల 15 సోమవారం నుంచి 18వ తేదీ గురువారం వరకు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ తెలిపారు. అలాగే బాలక్​రాముడి హారతి సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

one lakh Prasad to ayyodhya Baalaram