Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Parliament Elections: తెలంగాణలో జాతీయ యద్ధం

తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఎజెండా విచిత్రంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎజెండా అంతా జాతీయ రాజకీయాలపైన నడుస్తోంది.

ఎంపీ ఎన్నికలపై ప్రజల్లో సంచలన చర్చలు
మోదీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ప్రచారం
రైతు దీక్షలతో కమలం పార్టీ దూకుడు వ్యవహారం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు విమర్శల వర్షం
అత్యధిక స్థానాలను గెలుచుకునే దిశగా ప్రధాన పార్టీలు

ప్రజాదీవెన, పొలిటికల్ బ్యూరో: తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ఎజెండా విచిత్రంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎజెండా అంతా జాతీయ రాజకీయాలపైన నడుస్తోంది. మోదీ మరోమారు ప్రధాని అని బీజేపీ, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్ద చేస్తారు లేదా మార్చేస్తారంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేపడుతోంది.

ఆయా రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు జాతీయ రాజకీయ అంశాలే ప్రాధాన్యతా అంశాలుగా ప్రచారం చేస్తున్నారు. జాతీయ పార్టీలను పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారి ఎజెండా జాతీయ అంశాల చుట్టు పరిభ్రమిస్తుంటే… తెలంగాణలో మాత్రం స్థానిక అంశాలనే ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీలు ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తున్నాయి. అందులోను రైతు సంబంధింత అంశాల చుట్టే అటు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేప పార్టీలు తిరగడం విశేషంగా చెప్పాలి.

రైతు యాత్రలు నిర్వహించిన బీఆర్ఎస్.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాభవం పొందిన బీఆర్ఎస్(BRS) తిరిగి తన బలం పెంచుకునే దిశగా మరోసారి అన్నదాతలనే నమ్ముకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనే ఎక్కువ స్థానాలు గెల్చుకున్న గులాబీ పార్టీని రూరల్ తెలంగాణలోని ఫలితాలు పెద్ద దెబ్బతీసాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ,వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెద్దఎత్తున సీట్లు గెల్చుకుని మరో దఫా అధికారం చేపడతామని భావించిన బీఆర్ఎస్ కు ఆ జిల్లాల్లో ఘోర పరాభవం మిగిలింది. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే కారు పార్టీ పరువు కాపాడాయి. దీంతో రూరల్ తెలంగాణపై దృష్టి సారించిన గులాబీ దళపతి కేసీఆర్ రైతు ఎజెండాను మరో సారి పైకి తీసారు.

ఈ క్రమంలోనే పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు రూరల్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. రైతుల పొలం బాట పట్టి ఎండిన పంటలను పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగు నీరు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మరో వైపు కేసీఆర్ సైతం నల్గొండ, వంరగల్ జిల్లాల్లో ప్రత్యేకంగా రైతుల కోసం పర్యటన చేపట్టారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు . 2 లక్షల రైతు రుణ మాఫీ పై రేవంత్ ప్రభుత్వాన్నినిలదీసారు. 200 మంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ జవాబుదారీ అంటూ నిప్పులు చెరిగారు. రైతు బంధు కింద 15 వేల రూపాయల ఆర్థిక సాయం , ఎండిన పంలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా రైతు సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ , బీజేపీ ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ ఎన్నికల రాజకీయాల్లో సాగుతోంది.

రైతు దీక్షలతో కమలం పార్టీ దూకుడు…

వికసిత్ భారత్ కోసం మూడో సారి ప్రధానిగా మోదీని(Modi) గెలిపించాలని దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ రైతు అంశాల పైనే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను లక్ష్యాంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ ఇటీవలే ఒక రోజు రైతు దీక్ష చేపట్టారు. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్ష నిర్వహించారు.

రైతులకు సాగు నీరు ఇవ్వడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఎకరాకు 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని, అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ఈ దీక్ష ద్వారా బీజేపీ డిమాండ్ చేసింది. రైతు భరోసా కింద 15వేల ఆర్థిక సాయం చేయాలని, రైతు కూలీలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ కమలం నేతలు దీక్షలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను రైతు సమస్యలపై నిలదీయడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ ను అమలు చేస్తున్నాయి.

Parliament Elections in Telangana

రైతు హమీలపై కాంగ్రెస్ కౌంటర్…
దేశ మంతటా ఐ.ఎన్. డి. ఐ ఏ కూటమని గెలిపించాలని, రాహుల్ ను ప్రధాని చేయాలని కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ప్రచారం చేస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లెవనెత్తుతోన్న రైతు హమీలపైనే దృష్టి పెట్టి కౌంటర్ చర్యలు చేపట్టింది. రైతులకు నీరు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, తాము అధికారంలోకి వచ్చి మూడు నెలలే అవుతుందని, బీఆర్ఎస్ పాలనలోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా 2 లక్షల రైతు రుణ మాఫీ హమీ పై కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నిన్న నారాయణ పేటలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు హమీల్లోని రెండు రైతు హమీలను అమలు తేదీని ప్రకటించారు. ఆగష్టు 15వ తేదీ లోపు రాష్ట్రంలోని అర్హులైన 69 లక్షల రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. వచ్చే సీజన్ నుండి ధాన్యానికి 500 రూపాయలు క్వింటాకు బోనస్ గా చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో ఎజెండా మారుతుందా…

ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీలు రైతు రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్(Congress) పై విమర్శలు ఎక్కుపెడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ గా ఆగష్టు 15 లోపు మాఫీ ఉంటుందని చెప్పి ప్రతిపక్షాల నోరు మూసే ప్రయత్నం చేశారు. అయితే రానున్న రోజుల్లో సాగు నీరు విషయంలోను ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి.

పంటలు ఎండిపోవడం కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే పరిణామం అనే చెప్పాలి. అయితే ఎన్నికలు దగ్గవుతున్న కొద్ది రైతుల అంశమే ప్రధాన ఎన్నికల ప్రచారంశం అవుతుందా…లేక జాతీయ అంశాలు తెరపైకి వస్తాయా అన్నది మాత్రం వేచిచూడాలి. అంతే కాకుండా ఈ మూడు పార్టీల్లో రైతు ఓటు బ్యాంకు కొల్లగొట్టే పార్టీ ఏదా అన్నది కూడా వేచి చూడాల్సిన విషయమే.

Parliament Elections in Telangana