త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)
ప్రజా దీవెన/హైదారాబాద్: బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయo నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది.
చివరిసారిగా గతేడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ, మన ఊరు-మన బడి పురోగతిపై చర్చించేందుకు మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమైంది.
విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.