— స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్
Additional Collector Narayan: ప్రజాదీవెన నల్గొండ : వనమహోత్సవం కింద ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో 68 లక్షల 70 వేల 800 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ తెలిపారు. ఇందుకుగాను ఆయా శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. వనమహోత్సవం కింద ఈ సంవత్సరం జిల్లాలో నాటే మొక్కల ఏర్పాట్లపై బుధవారం అయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో నాటనున్న 68 లక్షల 70 వేల 800 మొక్కలలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 39 లక్షల 51,700 లు,వ్యవసాయ శాఖ ద్వారా 7 లక్షల 66 వేలు, ఉద్యాన శాఖ ద్వారా 6 లక్షల 38,000, మున్సిపాలిటీల ద్వారా 8 లక్షల 20 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు ఆయన తెలిపారు.మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా జిల్లా అధికారులు వారి లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ వనమహోత్సవం కింద
ఆయా శాఖలు వారికి నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించడమే కాకుండా, జియో ట్యాగింగ్ చేయాలని, నర్సరీలను మ్యాచింగ్, బ్యాచింగ్ చేయాలని, అంతేకాక ప్రముఖులు మొక్కలు నాటేందుకు ఒక విఐపి స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. మొక్కలు నాటే విషయంలో సాంకేతిక సలహాలు, సూచనలను అటవీ శాఖ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం వనమహోత్సవం కింద ప్రతి ఒక్కరూ అమ్మ పేరు పై ఒక మొక్క నాటుదాం అనే అంశాన్ని తీసుకోవడం జరుగుతుందని, పాఠశాల విద్యార్థుల పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి వారి ద్వారా మొక్కలు నాటించడం జరుగుతుందని, అందువల్ల జిల్లా విద్యాశాఖ ప్రతి పాఠశాలలో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
అన్ని శాఖలు వారు నాటిన మొక్కలకు సంబంధించి తప్పని సరిగా డాక్యుమెంటేషన్ ను తయారు చేయాలని, జల సంరక్షణ అభియాన్ కింద వివిధ రకాల పనులు చేపట్టడం జరిగిందని, ఆ పనులు చేసిన చోట మొక్కలు నాటేందుకు అవకాశం ఉన్నందున ఆ స్థలాల్లో మొక్కలు నాటాలని, అన్ని మొక్కలతో పాటు, ఇంటి పెరట్లో నాటే మొక్కలు, ఈత మొక్కలు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జడ్పీ ఇన్చార్జి సీఈఓ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి శ్రవణ్, ఎక్సైజ్ అధికారి సంతోష్, డీఈవో బిక్షపతి మాట్లాడారు.