–గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
— వారం లో గైడ్లైన్స్ విడుదల
— జిల్లాలో 168 మంది ఉద్యోగులకు స్థాన చలనం
— జూన్ 2 కల్ల విధుల్లోకి
— అప్పుడే మొదలైన పైరవీలు.!
Transfers in Panchayat Raj : ప్రజాదీవెన నల్గొండ : గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులందరికీ (వంద శాతం) బదిలీలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 250 జారీ చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో అన్ని కేడర్ లు కలిపి మొత్తం 168 మంది పని చేస్తున్నారు. ఇందులో ఏపీడీ, డీపీఎం, ఏపిఎం, సీసీలు, ఎఫ్టీఈలు, అడ్మిన్ అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లు ఉన్నారు. సెర్ఫ్ లో బదిలీలు లేక దాదాపు పదేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఉద్యోగులు ఒకే ప్రాంతం, ఒకే సీటులో పనిచేస్తూ పాకపోయారు. దీంతో కొంతమందికి అవినీతి చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రాంతంపై పట్టు సాధించి ఎవరికీ చిక్కకుండా తెలివిగా అవినీతికి పాల్పడుతున్నారు. అలాంటి ఉద్యోగులు తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాన్ని వదిలి వెళ్లేందుకు మనసు ఒప్పడం లేదు. మరి కొంత మంది ఒకే చోట పని చేయడం, దూర ప్రాంతాలకు విధులకు వెళ్లి రావడం ఇబ్బందికరంగా మారింది. అలాంటివారు మాత్రం బదిలీలు ఎప్పుడు వస్తాయని ఏళ్ళు గా ఎదురుచూస్తున్నారు.
–సీనియారిటీ జాబితా..
ఉద్యోగుల బదిలీలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సెర్ఫ్ రాష్ట్ర శాఖ భావిస్తోంది. ఇందుకు విధివిధానాలను కూడా రూపొందించడం తో పాటు ఉద్యోగుల సీనియారిటీ జాబితాను రెడీ చేస్తోంది. నూరుశాతం బదిలీలు చేపట్టనుండడంతో ఉద్యోగులందరూ బదిలీ కానున్నారు. ఏపీడీ, డీపీఎంలకు రాష్ట్ర స్థాయిలో, ఏపీఎంలకు జోనల్ స్థాయి లో, సీసీలు, ఇతర సిబ్బందికి జిల్లా స్థాయిలో బదిలీలు చేయనున్నారు. అయితే బదిలీలను ఏ విధంగా చేయాలనేదానిపై సెర్ఫ్ ఉన్నతా ధికారులు కసరత్తు చేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఏ విధంగా చేస్తారనే దానిపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బదిలీల నేపథ్యంలో కొంతమంది ఉద్యోగులకు కోరుకున్న స్థానాలకు బదిలీ అయ్యేందుకు ఇప్పటి నుంచే పైరవీలు మొదలుపెట్టారు. ఉద్యోగ సంఘ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు
–వారంలో గైడ్లైన్స్…
సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. వారంలో గైడ్లైన్స్ వచ్చే అవకాశాలున్నాయి. గైడ్ లైన్స్ ప్రకారం నెలాఖరు నాటికి బదిలీలు పూర్తి చేస్తారని తెలుస్తోంది. నెల చివరి నాటికి బదిలీలు పూర్తయితే జూన్ 2న నూతన స్థానంలో అధికారులు, సిబ్బంది బాధ్యతలు చేపట్టనున్నారు.
–జోరుగా పైరవీలు…
కావలసిన చోట పని చేసేందుకు
బదిలీల ప్రక్రియలో పైరవీలు జోరుగా సాగుతున్ననట్లు తెలిసింది. ఇప్పటికే ఉద్యోగ సంఘం నేతలు, కొందరు రాజకీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని వారి ద్వారా బదిలీలు చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే బదిలీల ప్రక్రియలో పైరవీల ప్రభావం వల్ల అర్హత ఉన్న వాళ్లకు నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని కొందరు సెర్ఫ్ అధికారులు, సిబ్బంది కోరుతున్నారు. అయితే వారంలో వెలువడే మార్గదర్శకాలలో సొంత మండలంలో ఉద్యోగం చేయారాదని, ఇంతకుముందు చేసిన మండలం, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మండలం లో కాకుండా వేరే చోటకి బదిలీ కావలసి ఉంటుందని, అదేవిధంగా వికలాంగులు, వితంతువులు, స్పౌజ్, మెడికల్ ఉన్న వారికి బదిలీలలో మినహాయింపు ఉంటుందని ఆ శాఖకు సంబంధించిన ఓ అధికారి తెలిపారు.