బిజేపి లో భారీగా సంస్థాగత మార్పులు
—తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
— ఎపి బీజేపీ సోము విర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరి
ప్రజా దీవెన/ న్యూ ఢిల్లీ: కమలదళంలో సంస్థాగత మార్పులు జరగబోతున్నాయని ఆది నుంచి అనుకున్నట్లుగానే బీజేపీ అధిష్టానం కార్యాచరణ చేపట్టింది. అందరూ అనుకున్నట్లు గానే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై వచ్చిన చర్చలు కూడా నిజమయ్యాయి.ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులను సహా దేశంలోని మరో 3 రాష్ట్రాల్లో కూడా ప్రెసిడెంట్ పదవిలో మార్పులు చేస్తూ మంగళవారం కమలదళ అధినేత జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. ఆ మేరకు తెలురురాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ సోము విర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరి.. తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
జార్ఖండ్ బీజేపీ ఆధ్యక్షుడిగా బాబులాల్ మరాండి, రాజస్థాన్లో గజేంద్రసింగ్ షెకావత్, పంజాబ్లో సునీల్ జాఖర్ కమలదళ పతులుగా నియమితులయ్యారు. ఇటీవల ప్రధానమంత్రి మోదీ కి మద్దతు పలుకుతూ బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయకార్యవర్గంలో చోటు లభించింది. అలాగే హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కి తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి దక్కగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టనున్నారు.
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యoలో రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 2024 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, అదే ఏడాది డిసెంబర్ నాటికి జార్ఖండ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ముందు నుంచి ఆయా రాష్ట్రాల్లోని పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం సంసిద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీ అధిష్టానం ఈ విధమైన మార్పులు చేసిందని తెలుస్తోంది.