Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripathi: ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం అభినందనీయం : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collector Tripathi: ప్రజాదీవెన నల్గొండ: నాంపల్లి మండలం పెద్దాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అభినందించారు. శుక్రవారం ఆమె నాంపల్లి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మండలంలోని పెద్దాపురం గ్రామంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలోని ఐ కె పి ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా, ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్య లేకుండా ధాన్యం సేకరణ చేయడం, నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించడం, రికార్డులను సరిగా నిర్వహించడం లో ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవడం పట్ల ఆమె కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అభినందించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ నాంపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ధాన్యాన్ని తనిఖీ చేసిన అనంతరం సమయానికి లారీలు రాకపోవడంపై గమనించి ప్రతిరోజు ఐదు లారీలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్ ను ఆదేశించారు.

అలాగే రైతులు కేంద్రానికి తాలు, తరుగు, చెత్త వంటి వాటితో ధాన్యాన్ని తీసుకురాగా గమనించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు పూర్తి నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. మధ్య దళారీలు ధాన్యాన్ని తీసుకొస్తే ఎట్టి పరిస్థితులలో ధాన్యాన్ని తీసుకోవద్దని కేంద్రం ఇంచార్జిని ఆదేశించారు. రైతులు మాత్రమే ధాన్యాన్ని తీసుకురావాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, తదితరులు ఉన్నారు.