Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM Julakanti Rangareddy : రైతు పంటకు మద్దతు ధరల చట్టం చేయాలి

–అన్ని రకాల వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేసి అదనంగా బొనస్‌ ఇవ్వాలి

–సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌

— ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

CPM Julakanti Rangareddy : ప్రజాదీవెన నల్లగొండ :  రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్‌ చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వ్యవసాయోత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగ ఆత్మస్థైర్యాన్ని కుంగతీసే విధంగా వుందని విమర్శించారు. వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని, రైతాంగం పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మధ్దతు ధరలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉందన్నారు. ప్రకృతి ఒకవైపు నుండి, పాలకులు ఇంకోవైపు నుండి మార్కెట్‌ శక్తులు మరోవైపు నుండి రైతాంగ మూలుగను పీల్చిపిప్పి చేయటానికి పూనుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాధన్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారము మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తామన్న మోడీ మాటలు నీటి మూటలైనాయని ఎద్దేవా చేశారు. ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలన్న ప్రతిపాదనను తుంగలో తొక్కి ఉత్పత్తి ఖర్చులకే 21 శాతం తగ్గించి ఎంఎస్‌పిని నిర్ణయించటంతో రైతాంగము దిగ్బ్రాంతికి గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంభాల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించలేదని అన్నారు.

ఇలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా నిధులను సాగుచేస్తున్న రైతులందరికి విడుదల చేయాలన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని మిగిలిన వారందరికి చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరూ గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేయాలని, అమలు చేయని ఎడల ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించాలన్నారు. శ్రీశైలం సొరంగం మార్గంలో మృతి చెందిన కుటుంభాలకు ప్రభుత్వం రెండు కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంభంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఎండాకాలంలో దృష్టిలో ఉంచుకొని తాగునీటి రిజర్వాయర్లలో స్టోరేజ్ చేయాలని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రేషన్‌కార్డులు, పించన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి వరకు ఇస్తారో నిర్ధిష్టమైన కాలపరిమితి ప్రకటించాలన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం, కళ్యాణ లక్ష్మి, షాధిముభారక్‌ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పెండింగ్ లో ఉన్నాయన్నారు.

ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, ధాన్యం కేంద్రాలను ప్రారంభించాలని అన్నారు. గ్రామీణ అంతర్గత రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారిల వెంట సర్వీస్‌ రోడ్స్‌ను వేయాలన్నారు. సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఆధాయం రాబట్టాడానికి యల్‌ఆర్‌ఎస్‌ పథకం పెట్టిందని, కనీస మౌళిక సధుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.

మున్సిపల్‌ కేంద్రాలలో ఆస్ధిపన్నులను విఫరీతంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను గుర్తించిన లబ్ధిదారులకు వెంటనే చూపించాలని, సకాలంలో చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.ఈ ధర్నా కార్యక్రమానికి పాలడుగు నాగార్జున అధ్యక్షత వహించగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, సయ్యద్‌ హాషం, పాలడుగు ప్రభావతి, సిహెచ్‌. లక్ష్మినారాయణ, వి. వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు గంజి మురళీదర్‌, పి. నర్సిరెడ్డి, మల్లం మహేష్‌, దండెంపల్లి సత్తయ్య, రవి, శశిధర్‌రెడ్డి, వినోద్‌, శ్రీను, సరోజ, అనురాధ, శంకర్‌, చంద్రమౌళీ, ఆనంద్‌, నగేష్‌, వెంకులు, వెంకన్న, సైదులు, బయ్యన్న తదితరులు పాల్గొన్నారు.