Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా పిల్లలు

— గర్భిణీలు ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి

–మూఢనమ్మకాలతో శిశు మరణాలు

–ఈనెల 28 న మేళా

–లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

–చందంపేట మండలంలో పర్యటన

–అంగన్వాడి కేంద్రం, పిహెచ్సి, కస్తూరి పాఠశాల తనఖీ

District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ బ్యూరో : గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వారితోపాటు, వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అందువల్ల ప్రతి గర్భిణీ ఆరోగ్యవంతమైన పిల్లల్ని ప్రసవించేందుకు పండ్లు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారం వంటి మాంసకృత్తులు, ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం, మూఢనమ్మకాలు, అవగాహన లోపం, తదితర కారణాల వల్ల జిల్లాలో శిశు మరణాలు సంభవిస్తున్నాయని, ఇకపై శిశు మరణలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు, వారి తల్లిదండ్రులు, అత్తమామలు దృష్టి సారిస్తే ఇవి తగ్గిపోతాయని తెలిపారు.

బుధవారం ఆమె చందంపేట మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు.అంగన్వాడి కేంద్రంలో సౌకర్యాలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకి ఇస్తున్న పౌష్టికాహారం, తదితర వివరాలను, రిజిస్టర్ లను పరిశీలించారు. ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని? పిల్లలు ఎంతమంది ఉన్నారని? అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలింతలు, గర్భిణీ స్త్రీలతో ఆమె మాట్లాడుతూ నవ మాసాలు మోసి పుట్టిన పిల్లలు చనిపోతే ఆ తల్లితో పాటు, కుటుంబానికి ఎంతో వేదన మిగులుతుందని, అందువల్ల అలా జరగకుండా మంచి ఆహారం తీసుకున్నట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.

శిశు మరణాలను నివారించడం, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మహిళలు పౌష్టికాహారము,ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై ఈనెల 28 న మేళా నిర్వహించడం జరుగుతుందని, ఈ మేళాకు హాజరు కావాలని ఆమె కోరారు.గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారంతో పాటు, క్రమం తప్పకుండా ఆస్పత్రులకు వెళ్లాలని పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవద్దని, ఒకవేళ ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్ష చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారి, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి అందరు విధులకు హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మందుల స్టాక్ రిజిస్టర్ తదితర వివరాలు అన్నింటిని జిల్లా కలెక్టర్ పరిశీలించడమే కాక, ఆసుపత్రి ని తిరిగి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆరవ,పదవ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థినిల చదువుకు సంబంధించిన పలు అంశాలను పుస్తకాలు చదివించడం, ప్రశ్నలు, జావాబుల ద్వారా వారి సామర్థ్యాలను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడివో లక్ష్మి, వైద్యాధికారి చందూలాల్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ఎస్ఓ కవిత, తదితరులు ఉన్నారు.