–కావలసిన పరికరాల జాబితాను ముందే పంపండి
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ: భవిత కేంద్రాలలో చేపట్టిన సివిల్ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె ఉదయాదిత్య భవన్ లో భవిత కేంద్రాల పై మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓ లు, ఐఆర్పీలు, తదితరులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా భవిత కేంద్రాల్లో చేపట్టిన పనుల నిర్వహణలో మండల ప్రత్యేక అధికారులు, ఐఆర్పీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు చేయిస్తుండడం పట్ల ఆమె అభినందించారు. జిల్లాలో 22 భవిత కేంద్రాలకు సివిల్ పనులు ప్రారంభించేందుకు అడ్వాన్సు సైతం మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
భవిత కేంద్రాలలో మెరుగైన వెసులుబాటు కల్పిస్తే పిల్లల సంఖ్య పెరుగుతుందని, ఎక్కువ మంది ఈ కేంద్రాలలో చేరుతారని, తద్వారా పటిష్టమవుతాయని, అందువల్ల ఎం ఎస్ ఓ లు, ఐఆర్పి లు వ్యక్తిగత శ్రద్ధ వహించి పనులు పూర్తి చేయాలన్నారు. ముందుగా అన్ని భవిత కేంద్రాలలో టాయిలెట్లు, రైలింగ్, ర్యాంపు, యాక్టివిటీ రూంలు ముఖ్యమని, వాటిని వారం రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు.
పిల్లలు భవిత కేంద్రాలను తమ సొంతంగా భావించే విధంగా కేంద్రాలలో పరికరాలతో పాటు, రంగులతో తీర్చిదిద్దాలన్నారు. ఇందుకుగాను ఆయా కేంద్రాలకు ఎలాంటి పరికరాలు కావాలో ముందే జాబితా పంపించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవిత కేంద్రాలలో వినియోగించనున్న సామాగ్రి, ఆట వస్తువులు, కుర్చీలు, ఆట బొమ్మలు, టీచింగ్, లర్నింగ్ మెటీరియల్ తదితరాలను ప్రదర్శించారు.
అదనపు కలెక్టర్లు జే .శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ, దేవరకొండ ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓ లు, ఐఆర్పీలు, బిక్షపతి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.