–వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
–వారి కార్య స్థానాలలో ఉంటు నష్టం వివరాలను తెలపాలి
–త్రాగునీరు, విద్యుత్ కు అంతరాయం రాకుండా చూడాలి
— ధాన్యం తడవకుండా మిల్లులకు తరలించాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
— టెలికాన్ఫరెన్స్ లో అధికారులకు సూచనలు
ప్రజాదీవెన నల్గొండ :రానున్న మూడు రోజులపాటు సాధారణ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జిల్లా నుండి మండల స్థాయి గ్రామ స్థాయి వరకు అధికారులు అందరూ వారి వారి కార్య స్థానాలలో ఉండాలని చెప్పారు. ఎక్కడైనా వర్షాల కారణంగా పిడుగులు పడి ప్రాణా నష్టం, ఆస్తి నష్టం వంటివి జరిగితే తక్షణమే సమాచారం అందించాలన్నారు. గురువారం ఆమె జిల్లా అధికారులతో వివిధ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రత్యేకించి మిషన్ భగీరథ, విద్యుత్తు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి తాగునీటి వ్యవస్థకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని, లోతట్టు ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లకుండా ముందుగానే అప్రమత్తం చేయాలని, పిడుగులు పడి పశువులు, మనుషులు చనిపోకుండా ముందు జాగ్రత్త. అవగాహన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా, అనుమతి లేకుండా ఎవరు సెలవుల్లో వెళ్ళవద్దని ఆమె ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వర్షానికి ధాన్యం తడవకుండా తక్షణమే ధాన్యాన్ని మిల్లులకు పంపించాలని, ఇంకా ఎక్కడైనా ధాన్యం వస్తున్నట్లయితే టార్పాలిన్లతో కప్పి ఉంచి దాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను బ్యాంకర్లు తక్షణమే పరిశీలించి ఎంపీడీవోలకు పంపించాలని ఆదేశించారు.
వర్షం కారణంగా విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చెరువులు, రోడ్లు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు ఎక్కడైనా నష్టం వాటిళ్లినట్లైతే తక్షణం సమాచారం అందించాలని తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్ కు జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.