–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
–చందంపేట పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి
వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా, చందంపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎప్పట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల ఓపి రిజిస్టర్ ను,ఇతర రిజిస్టర్ లను తనిఖీ చేశారు. అంతేకాక ఫార్మసిస్ట్ తో మందులు, స్టాక్ వివరాలను తనిఖీ చేసి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం మొత్తాన్ని ఆమె తిరిగి పీహెచ్ సి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ
వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన చందంపేట లాంటి మండల కేంద్రంలో ప్రజలకు సరైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ చందంపేట మండలం కంబాలపల్లి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఇక్కడ పాఠశాల యాజమాన్యం బోరు కావాలని విజ్ఞప్తి చేయగా, అందుకు జిల్లా కలెక్టర్ అంగీకరిస్తూ అంచనాలు రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశ్రమ పాఠశాలలోని వంటగదిని తనిఖీ చేసి వంట వారితో, పాఠశాల వర్కర్స్ తో మాట్లాడారు. అంతేకాక విద్యార్థులతో కూడా మాట్లాడారు.
ఇదే మండలం లోని యాపలపాయి తాండ లో ఉన్న ఆశ్రమ పాఠశాలను సైతం జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడమే కాకుండా, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం గురించి అడిగారు .
వంటగదిని తనిఖీ చేసి వంట సామాగ్రిని పరిశీలించారు. పై రెందు పాఠశాలల్లో వంటగదులు, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల తోపాటు, వంటగదిని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం పాలు కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, ఇతర అధికారులు, తదితరులు ఉన్నారు.