Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi: రానున్న మూడున్నరేళ్లలో 20 వేల ఇళ్లు కట్టించే బాధ్యత నాదే

— దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్

–అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ

District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడిసెలో నివసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తున్నదని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదని, అలాంటిది తాము ఇచ్చిన వాగ్దానం ప్రకారం లబ్ధిదారులందరికీ, ముఖ్యంగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున ఇండ్లు కట్టించి ఇస్తున్నామని, పేదల్లో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, రానివారు అధైర్య పడాల్సిన అవసరం లేదని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గం లో రానున్న మూడున్నర ఏళ్లలో పేదలకు 20వేల ఇళ్లను కట్టించే బాధ్యత తనదేనని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రం పొందిన లబ్ధిదారులు 30 రోజులలో గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేనట్లయితే మంజూరు రద్దవుతాయని తెలిపారు.

బేస్స్మెంట్ వరకు వచ్చిన తక్షణమే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇల్లు పూర్తయ్యేలోపు దశలవారీగా ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందని, లబ్ధిదారులు అర్ధాటాలకు వెళ్లకుండా ప్రభుత్వం నిర్దేశించిన 400 నుండి 600 చదరపు అడుగుల లో ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండల స్థాయిలో ఇసుక కమిటీ వేయడం జరుగుతుందని, లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హతలు లేని వారు ఉండరాదని, ఒకవేళ అలాంటి వారు ఉంటే చర్యలు తీసుకుంటామని, ఇండ్లు రాకుండా మిగిలిపోయిన వారు నిరాశ పడాల్సిన అవసరం లేదని, దశలవారీగా వీరికి కూడా ఇద్దరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గతంలో దేవరకొండ పట్టణంలో ఇల్లు నిర్మించుకుని రెగ్యులరైజేషన్ కానీ వారికి రెగ్యులరైజ్ చేయాలని, గ్రామ కంఠం, వక్ఫ్ భూములలో ఇల్లు నిర్మించుకున్న వారందరికీ హక్కు పత్రాలు కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మధ్యలో మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సైతం చేపట్టి పూర్తి చేస్తామని శాసన సభ్యులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాను పారదర్శకంగా, శాస్త్రీయపద్దతిలో, నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందించడం జరిగిందని తెలిపారు.

మొదటి విడతన ఇల్లు రాని వారు కంగారు పడాల్సిన అవసరం లేదని మొదటి విడతలో ఇల్లు కట్టుకునేందుకు జాగా ఉన్న వారికి మాత్రమే మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. లబ్ధిదారులు మంజూరు పత్రం పొందిన 30 రోజుల్లో ఇంటి నిర్మించుకోవాలని, లేనట్లయితే
రద్దు చేయవలసి వస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ప్రభుత్వమే ఇస్తుందని, ఇందుకు ఆర్డిఓ, తహసిల్దార్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాపీని చూపించవలసి ఉంటుందని,
ఇసుక కొరత ఉత్పన్నం కాకుండా ఇసుకను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

దీంతోపాటు ప్రతి మండలంలో ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేస్తామని, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, తాహసిల్దార్ ,ఇంజనీరింగ్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఈ కమిటీ ఇందిరమ్మ ఇండ్లకు వాడే సామాగ్రి ధరలు నియంత్రిస్తుందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గం లో 2346 మంజూరు ఉత్తర్వులను బుధవారం ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అంతకుముందు జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, విధివిధానాలు, తదితర అంశాలను వెల్లడించారు. దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.