Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi: మహిళా సంఘాల సభ్యులు పరిశ్రమల యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Ila Tripathi: స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు వివిధ రకాల ఉత్పత్తులు, పరిశ్రమల యూనిట్ల
ఏర్పాటుకు ముందుకు వస్తే వారికి అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వ సంస్థల ద్వారా అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని టిటిడిసి కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పరిశ్రమల శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల సంయుక్త సహకారంతో అలీప్ (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా) సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వివిధ రకాల వస్తువుల ఉత్పత్తి, పరిశ్రమల యూనిట్ ల ఏర్పాటు ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాల సంక్షేమం, అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులు ఒక్కొక్కరుగా కాకుండా, ఒక సంఘంగా ఏర్పడి, ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి సంఘాలుగా ఏర్పాటై వివిధ రకాల యూనిట్ల తో పరిశ్రమల ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లయితే రుణాలతో పాటు, వ్యాపార నిర్వహణకు అవసరమైన మెళకువలు, పరిజ్ఞానాన్ని ఆయా సంస్థల ద్వారా అందించడమే కాకుండా పూర్తి సహకారం అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఇదివరకే అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నందున వాటికి మార్కెటింగ్, బ్రాండింగ్ తో పాటు, ఏ ప్రాంతంలో ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే మంచి ఆదాయం వస్తుందో, లాభసాటిగా ఉంటుందో అన్న విషయాలను అలీప్ సంస్థ తో పాటు, వివిధ రకాల కంపెనీల సహకారాన్ని తీసుకొని వారికి తోడ్పాటును అందించే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.

దీనిద్వారా మహిళలే సొంతంగా ఒక కంపెనీని ప్రారంభించి సీఈఓ స్థాయికి ఎదగవచ్చని ఆమె సూచించారు. అందువల్ల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు నూతన వ్యాపారాలు, యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగి కుటుంబాలకు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఏపీడి శ్రవణ్ కుమార్,అలీప్ సంస్థ సెక్రటరీ పద్మజ , కమిటీ సభ్యురాలు పద్మావతి, సీనియర్ ప్రోగ్రామ్ అధికారి లక్ష్మీ ప్రియ, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్యాంసుందర్ తదితరులు, పాల్గొన్నారు.