Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi: శిశు మరణాల పట్ల అవగాహన కల్పించాలి

–వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎక్కడైనా శిశు మరణాలు సంభవిస్తే చర్యలు

–కలెక్టర్ ఇలా త్రిపాఠి

— ఇకపై సబ్ సెంటర్ వారీగా సమీక్ష నిర్వహిస్తామని వెల్లడి

District Collector Tripathi: ప్రజాదీవెన నల్గొండ:సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ప్రసవానికి ప్రసవానికి మధ్య దూరం ఎక్కువగా లేకపోవడం వల్ల శిశు మరణాలు సంభవించేందుకు అవకాశాలు ఉన్నాయని, అందువల్ల గ్రామీణ ప్రాంత మహిళల్లో వీటి పట్ల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో దేవరకొండ డివిజన్ పరిధిలో సంభవించిన శిశు మరణాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రసవ కేసులను పరిశీలించినట్లయితే వెంట వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టబోయే బిడ్డ సరైన విధంగా పుట్టకపోవడం, బరువు తక్కువగా పుట్టడం, ఇతర అవలక్షణాలతో పుట్టడం, లేదా అనారోగ్యంతో పుట్టడం వల్ల పుట్టిన తర్వాత మరణించేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ఇలాంటివి సంభవించకుండా ఉండేందుకు గాను గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, తల్లిదండ్రులు, అత్తమామలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రసవానికి ప్రసవానికి మధ్య దూరం ఎక్కువగా ఉండే విధంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించేలా చూడాలని, అదేవిధంగా పౌష్టికాహార లోపం కారణంగా పుట్టిన శిశువు మరణించేందుకు అవకాశాలు ఉన్నందున సరైన పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. పౌష్టికాహారం విషయమై ఇది వరకే దేవరకొండ ప్రాంతంలో పోషణ అభియాన్ సందర్భంగా ఏలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో ప్రదర్శనల తో సహా వివరించడం జరిగిందని చెప్పారు. అయినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ, ఏఎన్ ఎం లు ఇల్లిల్లు తిరిగి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అంగన్వాడి కార్యకర్తలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎక్కడైనా శిశు మరణాలు సంభవిస్తే సంబంధితులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ఇకపై సబ్ సెంటర్ వారీగా తాను సమీక్ష నిర్వహిస్తానని, సబ్ సెంటర్ వారీగా వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని, శిశు మరణం లేదా మాతృ మరణం సంభవిస్తే అందుకు గల కారణాలన్నింటిని అధ్యయనం చేసి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త మాతృ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్లు, తదితరులు హాజరయ్యారు.