–ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలి
–మాదక ద్రవ్యాల రహిత జిల్లా గా తీర్చిదిద్దాలి
–అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
–జిల్లా కలెక్టర్ త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ జిల్లాలో ప్రమాదాలకు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లాలో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు తగ్గించడానికి అవలంబించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నల్గొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్, జిల్లా ఎస్పీ అధ్యక్షతన జిల్లా రోడ్డు సేఫ్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా నివారించడం కోసం పోలీసులు, రోడ్డు భవనాలు, ఎక్సైజ్, ఆర్టీవో, ఆర్టీసీ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
నల్గొండ జిల్లా గుండా వెళ్లే జాతీయ రహదారులు 65, 167, 565, 365, 575 లతోపాటు నార్కట్పల్లి నుండి అద్దంకి వెళ్లే రాష్ట్ర రహదారులపై మొత్తం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించడం జరిగిందని, వీటిలో అత్యధికంగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి 65 పై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్న క్రమంలో ప్రవేట్ బస్సులకు ఫిట్నెస్ చెక్ చేయాలని, అలాగే ఓవర్ లోడ్ వెళ్లడం వలన అధిక ప్రమాదాలు జరగకుండా నివారించుటకు తనికీలు చేయాలని అన్నారు.
నల్గొండ నుంచి కొండమల్లెపల్లి పై ఎస్.హెచ్ 18 వద్ద తరచూ అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు రోడ్డుకు ఇరువైపుల మట్టి పోయించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్ని నేషనల్ హైవే, స్టేట్ హైవే, పంచాయతీ రోడ్డుల మూలలపై కంపచేట్లు తొలగించాలని అన్నారు. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు, ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులను ప్రాథమిక తక్షణ చర్యల కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రజలకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖలు కలిసి ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడాలని కోరారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అమ్మేవారిని, వినియోగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు గాను మిషన్ పరివర్తన్ క్రింద అవగాహన కార్యక్రమాలను, చర్యలను తీసుకుంటున్నప్పటికీ మరోసారి అన్ని పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఎవరైనా విద్యార్థులు గంజాయి, మాదకద్రవ్యాలు తీసుకుంటున్నట్లు దృష్టికి వస్తే వెంటనే తెలియజేయాలని అన్నారు. రైతులు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లయితే గుర్తించి గంజాయి పండించిన వారికి రైతు భరోసా వంటివి నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడంలో నిఘా పెంచి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకొని ఎక్కడికక్కడే గంజాయిని అరికడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యస్బి సీఐ రాము, డిటి ఆర్బి రిటైర్ సిఐ అంజయ్య, ఆర్ అండ్ బి, నేషనల్, స్టేట్ హైవే ఇంజనీర్ అధికారులు, ఎక్సైజ్, ఆర్టీసి, విద్యా శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.