–యంత్రాల ద్వారానే సేద్యం
–పనులు లేక వ్యవసాయ కూలీలు ఇతర పనులకు
— రసాయనాల ద్వారా పండించిన పంటలను తిని రకరకాల రోగాల బారిన పడుతున్న మనుషులు
Farmers: ప్రజాదీవెన నల్గొండ : కొన్నేళ్ల క్రితం వ్యవసాయ పనులన్నీ కేవలం ఎద్దులతో మాత్రమే చేసేవారు. రానురాను సాంకేతికత పెరిగిపోవడంతో ఎద్దుల స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి. గతంలో ముందస్తు వర్షాలు కురిస్తే పొలాలను ఎడ్లతో దుక్కిదున్ని పంటను సాగు చేసేందుకు అనువుగా చేసుకొనేవారు. గ్రామాల్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులు వేరుశనగ కాయల నుంచి విత్తనాలను వేరుచేసే పనులలో నిమగ్నమయ్యేవారు. అయితే ప్రస్తుతం వాటి స్థానం లో యంత్రాలు వచ్చాయి. గతంలో విత్తనాలను సాగు చేయడం, పంటలో కలుపు మొక్కలను తొలగించడం, మందులను పిచికారీ చేయడం, పంటను తొలగించే పనులు కేవలం మనుషుల ద్వారానే చేసే వారు. ఇప్పుడు విత్తనం సాగు చేయడం నుంచి కలుపు తొలగించడం, మందులు పిచికారీ చేయడం, పంటను తొలగించేందుకు అనేక రకాల పరికరాను ట్రాక్టర్లకు అమర్చుకొని మనుషులతో ప్రమేయం లేకుండా ఒకరిద్దరితోనే చేసుకుంటున్నారు.
–తగ్గిన సేంద్రియ ఎరువులు…
కొన్నేళ్ల క్రితం గ్రామాల్లో వ్యవసాయం చేసే రైతుల ఇళ్ళ ముందు వ్యవసాయం చేసేందుకు ఎడ్లను, పాడి సంపద కోసం పాడి పశువులను పెంచి పోషించుకొనేవారు. వాటి ద్వారా వచ్చే పేడ, గోమూత్రం ను ఎరువులుగా మార్చుకొని పంట పొలాలకు వాడే వారు. వీటిదారి పండించిన పంటల ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. నేడు విత్తనాలను నిల్వ చేసుకొనడం నుంచి పంటను సాగు చేసి పంట ఇంటికి చేరే వరకు అనేక రకాల రసాయన ఎరువుల వాడకం పెరిగింది. ప్రస్తుతం పశువుల ద్వారా వ్యవసాయం చేసేవారు కనుమరుగయ్యారు. మారు మూల గ్రామాల్లో సైతం వ్యవసాయానికి వాడే పశువులు లేకపోగా యంత్రాల ద్వారానే పంటలను సాగు చేసుకుంటున్నారు. రసాయన ఎరువుల ద్వారా పండించి పంటలను తింటున్న ప్రజలు రకరకాల వింత రోగాల బారిన పడుతున్నారు. నేడు సేంద్రియ పద్దతి ద్వారా పండించిన పంటలకు డిమాండ్ పెరిగింది.