–సాగుకు ముందే కనీస మద్దతు ధర ప్రకటన
— పెట్టుబడిపై 50 శాతం లబ్ధిచేకూరేలా కీలక నిర్ణయం
–ఈసారి పత్తి క్వింటాలు ధర
రూ.589 పెంపు.. జొన్నకు రూ.328 పెరుగుదల
–కేంద్రం నిర్ణయంతో అన్నదాత హర్షాతిరేఖం
Farmers: ప్రజాదీవెన నల్గొండ బ్యూరో: వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్న రైతుకు ఏరువాకకు ముందే కేంద్రం కనీస మద్దతు ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఖరీఫ్ పంట ఉత్పత్తుల ధరలను రైతుకు గిట్టుబాటు అయ్యేలా నిర్ణయం తీసుకుంది. గతఏడాది కంటే ఈసారి పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నష్టాలను చవిచూస్తున్న రైతులకు ఊరట కల్పించేలా పంట పెట్టుబడిపై 50 శాతం లబ్ది చేకూరేలా మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోగా ధరల పెంపుకోసం ప్రత్యేకంగా రూ. 2.70 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. 2025-26 ఖరీఫ్ సీజన్లో 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదించగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంటలకు కనీస మద్దతు ధరలు ఈసారి ఆశాజనకంగా పెరిగాయి.
–పత్తి క్వింటాల్ మద్దతు ధర రూ. 8110..
పత్తి క్వింటాలు మద్దతు ధర గత ఏడాది రూ. 7121 ఉండగా ఈసారి మీడియం సెపుల్ క్వింటాల్ ధర రూ. 7710, లాంగ్ సెపుల్ ధర రూ. 8110గా కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది కంటే ఈసారి క్వింటాలుకు రూ.589, పత్తి ధర పెరుగడం రైతులకు ఊరట కల్పిస్తుంది. జొన్న ధర క్వింటాలుకు రూ.3371 ఉండగా ఈసారి రూ.3749 ధర పెరిగిగింది. క్వింటాలుకు రూ.328 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక 14 రకాల పంటలను కనీస మద్దతు ధర నిర్ణయించగా వరి సాధారణ గ్రేడ్ ఎ రకానికి
క్వింటాలుకు రూ. 69 పెరుగగా, సజ్జలు క్విం టాలుకు రూ.150, రాగులకు రూ.596 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్నకు గత ఏడాది కంటే ఈసారి క్వింటాలుకు రూ. 175 పెరిగింది. కంది పప్పు క్వింటాలు మద్దతు ధర రూ.450 పెంచగా, పెసర్లకు రూ. 86 పెరిగింది. ఈ సీజన్ ను పోలిస్తే ఈసారి మినుములకు కనీస మద్దతు ధర క్వింటాలుపై అదనంగా రూ. 400లు పెరుగగా వేరు శనగ కురూ.480, సోయాబిన్ కు రూ.436 పెరిగింది. నల్లగొండ జిల్లాలో ఈసారి 5.20 లక్షల ఎకరాలలో వరి సాగు, 5.40 లక్షల పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచడంపై రైతుల్లో హర్షాతిరేఖం వ్యక్తం అవుతుంది. సగటు ఉత్పత్తి వ్యయంతో ఒకటిన్నర రేట్ల మద్దతు ధర పెరుగడం రైతులకు ఊరట కలిగిస్తుంది.
–పెరిగిన ధరలు ఇలా..
వరి 69 రూపాయలు పెరిగి రూ. 2369 ధర రానుంది. జొన్నలు రూ. 328 పెరిగి 3699, సజ్జలు రూ. 130 పెరిగి 2775, రాగులు రూ. 596 పెరిగి రూ. 4886, వేరుశనగ రూ. 480 పెరిగి రూ. 7263, మొక్కజొన్న రూ. 175 పెరిగి రూ. 2400, కంది రూ. 450 పెరిగి రూ. 8000, పెసర రూ. 86 పెరిగి రూ. 8768, మినుము రూ. 400 పెరిగి రూ. 7800, పొద్దుతిరుగుడు రూ. 441 పెరిగి రూ. 7721, సోయాబీన్ రూ. 436 పెరిగి 5328, పత్తి రూ. 589 పెరిగి 8110 మద్దతు ధర లభించనుంది.